Reading Time: < 1 minute
Ap Deputy Cm Pawan Kalyan Orders Conservation Kondakarla Ava Wetland

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల (Wetlands) గుర్తింపు, పరిరక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ మంచినీటి సరస్సు ‘కొండకర్ల ఆవ’ను వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ‘పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్ రిజర్వ్) ప్రాంతంగా ప్రకటించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. అటవీశాఖ సిద్ధం చేసిన ఈ ప్రతిపాదనలకు జలవనరుల శాఖ ఆమోదం తెలుపుతూ, అవసరమైన నిరభ్యంతర పత్రాన్నిజారీ చేయడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

స్థానిక రైతుల సాగునీటి అవసరాలు, మత్స్యకారుల జీవనోపాధి , జలాశయ నిర్వహణ వంటి ప్రజా ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చింది. అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవ అనేక రకాల వలస, స్థానిక పక్షులకు సురక్షిత ఆవాసంగా నిలుస్తోంది. కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి, జలవనరుల శాఖతో సమన్వయం చేసుకుంటూ పర్యావరణహిత ‘ఎకో-టూరిజం’ అభివృద్ధి అవకాశాలపై అధ్యయనం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పర్యావరణాన్ని కాపాడుతూనే, ఎకో-టూరిజం ప్రాజెక్టుల ద్వారా స్థానిక ప్రజలకు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.

శాస్త్రీయ అధ్యయనాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 950 చిత్తడి నేలలను గుర్తించగా, తొలి దశ కింద 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియ తుది దశకు చేరిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చిత్తడి నేలల పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత సాధ్యమవుతాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పర్యావరణ పరిరక్షణ చర్యలను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొంటూ, చిత్తడి నేలల ఆక్రమణలు , విధ్వంసక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను గట్టిగా ఆదేశించారు.