July 21, 2026

Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు

Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
Reading Time: 2 minutes
Supreme Court Questions Sonam Raghuvanshi Meghalaya Honeymoon Murder Case

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త రాజా రఘువంశీపై దాడి జరిగిన తర్వాత ఆమె ప్రవర్తనపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. అవసరమైతే సోనమ్ బెయిల్‌ను రద్దు చేసి లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలే ధర్మాసనం మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సోనమ్‌కు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం సోనమ్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి కీలక ప్రశ్నలు సంధించింది. ‘‘మీ ప్రవర్తనను ఎలా సమర్థించుకుంటారు? పోలీసుల కథనం ప్రకారం మీరు, మీ భర్త ఇద్దరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఆయనపై దాడి జరిగి మరణించాడు. ఆ తర్వాత మీరు ఏం చేశారు? ఇదే ప్రధాన ప్రశ్న. అలాగే అరెస్ట్ కారణాలపై మీరు మొదటి నుంచే అభ్యంతరం వ్యక్తం చేశారా?’’ అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని లేదా సోనమ్ లొంగిపోయి ట్రయల్‌ను ఎదుర్కోవాలని ఆదేశిస్తామని ధర్మాసనం తెలిపింది.

జస్టిస్ సుందరేశ్ మాట్లాడుతూ.. ‘‘మా ఆలోచన మీకు ముందే తెలియజేస్తున్నాం. మీకు ఆశ్చర్యం కలగకుండా, మా అభిప్రాయం ఏంటో అర్థం చేసుకునేందుకు ఈ సూచన చేస్తున్నాం. మీ క్లయింట్ నుంచి సూచనలు తీసుకుని మళ్లీ కోర్టుకు రండి.’’ అని సోనమ్ తరఫు న్యాయవాదికి సూచించారు.

మేఘాలయ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. వివాహం అనంతరం హనీమూన్ కోసం రాజా, సోనమ్ మేఘాలయకు వెళ్లారని తెలిపారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. సోనమ్ ముందుగానే కుట్ర పన్ని తన భర్తను కొండ ప్రాంతంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిందని, ఆమె ప్రియుడు ఏర్పాటు చేసిన ముగ్గురు వ్యక్తులు వారిని అనుసరించారని కోర్టుకు వివరించారు. ముందుగా రాజాను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని లోయలోకి తోసివేశారని దర్యాప్తులో తేలిందని తెలిపారు. హత్య అనంతరం సోనమ్ అక్కడి నుంచి పరారైందని, తర్వాత ఆమె ప్రియుడు పరిస్థితి అనుకూలంగా ఉందని చెప్పడంతో ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయిందని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన కారణాలు సోనమ్‌కు పూర్తిగా తెలుసని కూడా తుషార్ మెహతా వాదించారు.

సోనమ్ తరఫు న్యాయవాది మాత్రం ఈ కేసును మీడియా అతిగా ప్రచారం చేసిందని.. ఇది పూర్తిగా పరిస్థితుల ఆధారాలపై నడుస్తున్న కేసేనని వాదించారు. అయితే ఈ దశలో ప్రాసిక్యూషన్ ఆరోపణలపై సవివరంగా చర్చించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో అరెస్ట్ మెమోలో ఉన్న టైపోగ్రాఫికల్ పొరపాటును హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడం సమంజసమేనా అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించనున్నట్లు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.