July 21, 2026

CJP Protest: ‘ఛలో పార్లమెంట్‌’ ఉద్యమంలో కీలక పరిణామం..

CJP Protest: ‘ఛలో పార్లమెంట్‌’ ఉద్యమంలో కీలక పరిణామం..
Reading Time: 2 minutes
Cjp Claims Centre Reached Out For Talks Abhijeet Dipke Ends Hunger Strike

CJP Protest: ఢిల్లీలో జరుగుతున్న ‘ఛలో సంసద్’ ఉద్యమం మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలకు ముందుకొచ్చిందని ప్రకటించింది. పార్టీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ చర్చలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. CJP ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ, ప్రభుత్వం ఉదయం తమను సంప్రదించిందని పేర్కొన్నారు. తాను, అశుతోష్ రాంకా కలిసి పార్టీ తరఫున జేపీ నడ్డాతో భేటీ కానున్నామని తెలిపారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, యువత డిమాండ్లపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఉద్యమానికి వేలాది మంది యువత మద్దతు తెలుపుతున్నారని, తమ డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో, ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినప్పటికీ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే ప్రభుత్వ వైపు నుంచి ఇంకా స్పష్టత లేదని, “ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులోనే ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే తన నిరాహార దీక్షను విరమించారు. ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు ఆయన దీక్షను ముగించారు. జూలై 18న వాంగ్‌చుక్ 21 రోజుల నిరాహార దీక్ష కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన తర్వాత, ఆయనకు మద్దతుగా దిప్కే దీక్ష ప్రారంభించారు.

మరోవైపు, ‘సంసద్ ఛలో’ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు భారీగా బలగాలను మోహరించి, పార్లమెంట్ వైపు నిరసనకారులు వెళ్లకుండా అడ్డుకున్నారు. యూనిఫామ్ పోలీసులతో పాటు సాధారణ దుస్తుల్లో ఉన్న సిబ్బందిని కూడా భారీ సంఖ్యలో నియమించారు. ఇదిలా ఉండగా, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనం వాంగ్‌చుక్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం సాధారణంగా ఉందని, కనీసం తాత్కాలికంగానైనా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లి ‘సంసద్ ఛలో’ ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినా, CJP చేసిన చర్చల ప్రకటనతో ఈ ఉద్యమం కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల సంస్కరణలు, యువత డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.