Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కేంద్ర ప్రభుత్వం కీలకమైన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. హోంమంత్రి అమిత్ షా సోమవారం ‘జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026’ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ‘వందేమాతరం’కి ప్రస్తుతం జాతీయ గీతం ‘జన గణ మన’కు ఉన్నట్లే చట్టపరమైన రక్షణ లభించనుంది.
1971 చట్టానికి సవరణ
ఈ బిల్లు ద్వారా 1971 నాటి ‘జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టం’లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం జాతీయ పతాకం, భారత రాజ్యాంగం, జాతీయ గీతం ‘జన గణ మన’కు ఉన్న చట్టపరమైన రక్షణను ‘వందేమాతరం’కి కూడా విస్తరించాలన్నదే ఈ బిల్లులోని ప్రధాన ఉద్దేశం.
‘వందేమాతరం’ను అవమానిస్తే శిక్ష
ప్రతిపాదిత సవరణల ప్రకారం, ‘వందేమాతరం’ను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అగౌరవపరచడం లేదా ఆలపించడాన్ని అడ్డుకోవడం నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే ప్రస్తుతం జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
ఆలపించడాన్ని అడ్డుకున్నా చర్యలు
ఈ బిల్లులో మరో కీలక అంశం ఏమిటంటే, ‘వందేమాతరం’ ఆలపించే కార్యక్రమాన్ని అడ్డుకోవడం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు. అలాగే గీతాన్ని ఏ రూపంలోనైనా ఉద్దేశపూర్వకంగా అవమానించినా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
150వ వార్షికోత్సవం నేపథ్యంలో నిర్ణయం
‘వందేమాతరం’ రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ గీతానికి మరింత చట్టబద్ధమైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో కేంద్రం తీసుకున్న చర్యలు
ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసి, ‘జన గణ మన’ ఆలపించే అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ను కూడా ఆలపించడం ప్రోత్సహించాలని సూచించింది. ఇప్పుడు ఈ కొత్త సవరణ బిల్లుతో ‘వందేమాతరం’కి మరింత బలమైన చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
బిల్లు ఆమోదం పొందితే…
ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా మారితే, ‘వందేమాతరం’ను అవమానించడం లేదా దాని ఆలాపనకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. దీంతో దేశ జాతీయ గౌరవ చిహ్నాలకు ఉన్న రక్షణ పరిధిలో ‘వందేమాతరం’ కూడా చేరనుంది.