July 20, 2026

Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..

Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
Reading Time: < 1 minute
Hyderabad Woman Trapped Oman Housemaid Abuse

Hyderabad: ఉపాధి కోసం ఒమన్ వెళ్లిన హైదరాబాద్ మహిళ అక్కడ చిత్రహింసల్ని ఎదుర్కొంటోంది. రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పని చేయించుకుని, నాలుగు నెలలుగా జీతం ఇవ్వలేదని ఆరోపించింది. ఈ చిత్ర హింసల నుంచి తనను రక్షించాలని వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన షబ్నమ్ బేగం (26) ఈ ఏడాది మార్చి 26న స్థానిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ ఇంటి పనిమనిషి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో ఒమాన్‌లోని మస్కట్‌కు వెళ్లింది.

అక్కడికి వెళ్లిన తర్వాత పలు ఇళ్లలో రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పనిచేయించారని, నాలుగు నెలలుగా ఎలాంటి జీతం ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. నెలన్నర పాటు తనకు మొబైల్ ఫోన్ కూడా ఇవ్వలేదని, తనను కొట్టారని, హింసించారని, సరైన ఆహారం కూడా ఇవ్వలేదని షబ్నమ్ కన్నీరు కారుస్తూ వీడియోలో వెల్లడించింది. ఈ వీడియోను హైదరాబాద్‌లోని మజ్లిచ్ బచావో తహ్రీక్ నేత అమ్జద్ ఉల్లా ఖాన్‌కు పంపింది. యజమానుల వేధింపులు భరించలేక అక్కడి నుంచి తప్పించుకుని మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాయలానికి వెళ్లినట్లు షబ్నమ్ చెప్పారు. తన పాస్‌పోర్టును రిక్రూట్మెంట్ ఏజెంట్లు తీసుకున్నారని, తనను స్వదేశానికి తీసుకురావాలని ఆమె కోరారు.

అమ్జద్ ఉల్లా ఖాన్ చెప్పిన వివరాల ప్రకారం.. నెలకు 200 ఒమానీ రియాల్స్ (సుమారుగా రూ. 50 వేలు) ఇస్తామనే హామీపై మహిళ ఒమాన్‌కు వెళ్లిందని, కానీ అక్కడ హామీకి విరుద్ధంగా పని చేయించి జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జోక్యం చేసుకుని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా షబ్నమ్‌ను సురక్షితంగా భారత్ తీసుకురావాలని కోరారు.