2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..

2027 వన్డే ప్రపంచకప్కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత జట్టు ఎంపికపై క్రీడా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ 2027 ప్రపంచకప్ కోసం తనకిష్టమైన 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. అయితే ఆయన ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ మహమ్మద్ షమీలకు స్థానం లభించకపోవడం గమనార్హం. అంతేకాకుండా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లను కూడా ఆయన పక్కనబెట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ప్రధాన జట్టులో కాకుండా కేవలం బ్యాకప్ ఓపెనర్గా మాత్రమే ముకుంద్ భావించారు.
ముకుంద్ ఎంచుకున్న జట్టులో టాప్ ఆర్డర్ బాధ్యతలను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లకు అప్పగించారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్కు చోటు కల్పించగా, వికెట్ కీపింగ్ ఆప్షన్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేశారు. ఆల్ రౌండర్ల విభాగానికి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకు అవకాశం ఇచ్చారు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు.
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాతో పాటు ఇటీవలే అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్కు అనూహ్యంగా చోటు కల్పించారు. మొత్తం ఐదుగురు పేసర్లతో పేస్ దళాన్ని బలంగా తీర్చిదిద్దారు. రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్లను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, పరిస్థితిని బట్టి ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు.
అభినవ్ ముకుంద్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు..
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా.