రోజంతా ఫోన్ వాడుతున్నారా?.. ‘స్మార్ట్ఫోన్ బ్రెయిన్’ ప్రమాదాన్ని గుర్తించండి!
ఈ రోజుల్లో పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ఫోన్ చేతిలో లేకపోతే గడవని పరిస్థితి ఏర్పడింది. కానీ రోజంతా స్క్రీన్ వంక చూస్తూ గడపడం వల్ల యువత, కౌమారదశ పిల్లలు ‘స్మార్ట్ఫోన్ బ్రెయిన్’ లేదా డిజిటల్ అలసట అనే కొత్త జబ్బు బారిన పడుతున్నారని న్యూరాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మెదడు పనితీరును దెబ్బతీసే ఈ సమస్య ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏంటో ఈ ‘స్మార్ట్ఫోన్ బ్రెయిన్’?: అతిగా ఫోన్ వాడటం వల్ల మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. దీనినే వైద్యులు డిజిటల్ అలసట లేదా ‘స్మార్ట్ఫోన్ బ్రెయిన్’ అంటున్నారు. ఇక ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే కాంతి, నిరంతరం సమాచారాన్ని చూడటం వల్ల మెదడుకు విశ్రాంతి దొరకక మెదడు నరాలు బలహీనపడతాయి.
పిల్లలు, యువతలో ముదురుతున్న లక్షణాలు: ఈ సమస్య కారణంగా తీవ్రమైన తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, చదివింది లేదా అనుకున్నది మర్చిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో కళ్లు తిరగడం, నిరంతరం తీవ్రమైన గందరగోళానికి గురికావడం జరుగుతోందని న్యూరాలజిస్టులు చెబుతున్నారు.

నిద్రలేమి, మానసిక అలసట: రాత్రివేళల్లో ఆలస్యంగా ఫోన్ వాడటం వల్ల నిద్ర సరిగ్గా పట్టక నిద్రలేమి సమస్య పెరుగుతోంది. ఇక ఫలితంగా పగటిపూట నిస్తేజంగా ఉండటం, చిన్న విషయాలకే కోపం రావడం పనులపై దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలతో చాలామంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఇక స్మార్ట్ఫోన్ మన జీవితాన్ని సులువు చేసిన మాట వాస్తవమే, కానీ దాని వాడకం హద్దు దాటితే మన మెదడుకే ప్రమాదకరం. రోజూ ఫోన్ వాడే సమయాన్ని తగ్గించుకుంటూ, కాసేపు ప్రకృతిలో గడపడం లేదా వ్యాయామం చేయడం ద్వారా ఈ ‘స్మార్ట్ఫోన్ బ్రెయిన్’ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
గమనిక: మీకు లేదా మీ ఇంట్లోని పిల్లలకు ఈ తరహా లక్షణాలు కనిపించి తీవ్ర అసౌకర్యం ఉంటే వెంటనే న్యూరాలజిస్ట్ లేదా మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
The post రోజంతా ఫోన్ వాడుతున్నారా?.. ‘స్మార్ట్ఫోన్ బ్రెయిన్’ ప్రమాదాన్ని గుర్తించండి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.