July 21, 2026

PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Reading Time: 2 minutes
Pm Modi Urges Meaningful Debate Ahead Of Parliament Monsoon Session 2026

PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు, రాజకీయ పార్టీలకు కీలక సందేశం ఇచ్చారు. ఈ సమావేశాలు దేశానికి అత్యంత ఫలవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, పార్లమెంట్‌లో చర్చలు తర్కం, వాస్తవాల ఆధారంగా సాగాలని అన్నారు. “వాదనలు, వాస్తవాలు ఉన్నచోట అనవసరమైన రాద్ధాంతం అవసరం లేదు. వాస్తవాలు బలంగా ఉంటే గొంతు పెంచాల్సిన అవసరం ఉండదు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ.. రుతుపవనాలు ఎంత ముఖ్యమో, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా అంతే ఫలవంతంగా సాగాలని ఆకాంక్షించారు. రుతుపవనాలు చురుకుగా ఉండి రైతులకు మేలు చేయడంతో పాటు, పార్లమెంట్ సమావేశాలు కూడా సజావుగా జరిగి దేశ ప్రయోజనాలకు దోహదపడాలని కోరుకున్నారు.

గత నెలలో భారత్ సాధించిన పలు విజయాలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష రంగాల్లో దేశం విశేష పురోగతి సాధించిందని తెలిపారు. ఇటీవల ఒక భారతీయ యువత నేతృత్వంలోని స్టార్టప్ అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిని చేరుకోవడం దేశానికి గర్వకారణమని అన్నారు. గత ఏడాది భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండగా, ఇప్పుడు భారత యువత అంతరిక్ష సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఇది యువత సామర్థ్యం, ఆశయాలు అపరిమితమని ప్రపంచానికి చాటి చెబుతోందని అన్నారు మోడీ..

దేశ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను కూడా ప్రధాని వివరించారు. ఇటీవల రాజస్థాన్‌లో భారీ చమురు శుద్ధి కర్మాగారాన్ని దేశానికి అంకితం చేసినట్లు గుర్తు చేశారు. అలాగే దేశంలోని మూడో సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభం, గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే రైలు ప్రారంభం వంటి ప్రాజెక్టులు భారత సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనాలని పేర్కొన్నారు. ప్రపంచంలో కొద్ది దేశాలకు మాత్రమే ఉన్న గ్రీన్ హైడ్రోజన్ రైలు సాంకేతికత ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి రావడం గర్వకారణమని చెప్పారు ప్రధాని మోడీ..

ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వాటిలో ఆదాయపు పన్ను సవరణ బిల్లు-2026, సుప్రీంకోర్టు సవరణ బిల్లు-2026, జాతీయ గౌరవానికి అవమానాల నివారణ సవరణ బిల్లు-2026, జనన-మరణాల నమోదు సవరణ బిల్లు-2026, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు-2026, విదేశీ విరాళాల సవరణ బిల్లు-2026, అలాగే డెవలప్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బిల్లు-2025 వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో కొన్ని పరిపాలనా సంస్కరణలు, న్యాయవ్యవస్థ బలోపేతం, విద్యా రంగ పునర్వ్యవస్థీకరణ, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహం వంటి అంశాలకు సంబంధించినవిగా ప్రభుత్వం పేర్కొంది మోడీ..

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపిన వివరాల ప్రకారం, జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు 25 రోజుల వ్యవధిలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ కాలంలో మొత్తం 19 సమావేశాలు జరగనున్నాయి. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలపై చర్చలు, సంప్రదింపులు, కీలక నిర్ణయాలు ఈ సమావేశాల్లో తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా చర్చించి ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ..