July 21, 2026

KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..

KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
Reading Time: < 1 minute
Ktr %e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 %e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be %e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b1%81 %e0%b0%a2%e0%b0%bf%e0%b0%b2

KTR: తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాన్సువాడలో మరోసారి గులాబీ జెండా ఎగరేసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచి పార్టీ మారారని, ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగోలేదని ఆయనకు అర్థమైందన్నారు. “కుడితిలో పడిన ఎలుకలా పోచారం పరిస్థితి తయారైంది. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా ఆయన ఓడిపోవడం ఖాయం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

“ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ మారను” అని చెప్పిన పోచారం చివరకు మాట తప్పి పార్టీ మారారని ఆరోపించారు. స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకునే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. పోచారం తన రాజకీయ భవిష్యత్తును తానే సమాధి చేసుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా చేతులెత్తేశారని ఆరోపించారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి కూడా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏ సభ పెట్టినా కేసీఆర్‌ను విమర్శించడమే సీఎం పనిగా మారిందన్నారు.

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, షాపుల్లో ఎరువుల సంచులు లేకపోతే యాప్‌లో కనిపించినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీకి పంపేందుకు సంచులు ఉంటున్నాయని, కానీ రైతులకు మాత్రం అందడం లేదని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కేటీఆర్ స్పందించారు. రెండు పిల్లర్లు కుంగి 31 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కన్నెపల్లి నుంచి ప్రతిరోజూ నీరు కిందకు వెళ్తున్నా పంపింగ్ చేయడం లేదన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కు వెళ్తే ప్రభుత్వం మాత్రం “కోల్డ్ స్టోరేజ్”లోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం అవసరమైతే రక్తమే కాదు ప్రాణాలు కూడా ఇస్తామని బీఆర్ఎస్ ఎప్పుడూ చెప్పిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.