ఒకరిద్దరు కాదు.. 2026లో టీమిండియాకు హ్యాండిచ్చిన ఆరుగురు ప్లేయర్లు.. ఎందుకంటే?

Indian players injury list 2026: ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఎదుర్కొన్న ఓటమి కంటే, ఆటగాళ్లను వెంటాడిన గాయాల సమస్యే జట్టు యాజమాన్యాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. 2026 సీజన్ ప్రారంభం నుంచి కీలకమైన ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడటంతో స్థిరమైన తుది జట్టును ఎంపిక చేయడం కెప్టెన్ శుభ్మన్ గిల్కు పెద్ద సవాలుగా మారింది. ఆటగాళ్ల ఫిట్నెస్పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన గిల్, ఈ గాయాల సమస్య జట్టు ప్రదర్శనను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
జస్ప్రీత్ బుమ్రా నుంచి హార్దిక్ పాండ్యా వరకు..!
ఈ ఏడాది భారత వైద్య బృందానికి ఏమాత్రం విశ్రాంతి దొరకలేదని చెప్పవచ్చు. జట్టులోని దాదాపు ప్రతి ప్రధాన ఆటగాడు ఏదో ఒక సందర్భంలో గాయపడి మైదానానికి దూరమయ్యాడు. ప్రతిష్ఠాత్మక మ్యాచ్లకు ముందు స్టార్ ప్లేయర్లు దూరం కావడం భారత విజయ అవకాశాలను దెబ్బతీసింది.
2026లో తీవ్ర గాయాల బారిన పడి సిరీస్లకు దూరమైన భారత ఆటగాళ్ల వివరాలు ఇవే:
1. హార్దిక్ పాండ్యా – తిరగబెట్టిన వెన్నునొప్పి, తొడ కండరాల గాయం..
ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ ఏడాది ఒక పీడకలలా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో వెన్నునొప్పితో బాధపడిన హార్దిక్, ఆ తర్వాత ఫిట్నెస్ పరీక్షలో తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ పర్యటనలకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ ఏడాది అతను ఏకంగా 11 అంతర్జాతీయ మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది.
2. జస్ప్రీత్ బుమ్రా – మోకాలి గాయంతో లార్డ్స్ మ్యాచ్కు దూరం..
భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ ఎడమ మోకాలికి తీవ్ర గాయం చేసుకున్నాడు. మరుసటి రోజుకి వాపు పెరగడంతో లార్డ్స్ మైదానంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేకు అతడు దూరమయ్యాడు. బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ బలహీనపడి, ఇంగ్లాండ్ రికార్డు స్కోరు సాధించింది.
3. విరాట్ కోహ్లీ – తొడ కండరాల గాయంతో ఆందోళన..
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అఫ్గానిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే, సకాలంలో కోలుకుని ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు అందుబాటులోకి వచ్చి రెండు అర్ధశతకాలతో రాణించాడు.
4. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి..
ఇంగ్లాండ్ పర్యటనలోనే వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ చేస్తూ తొడ కండరాల గాయానికి గురై ఆఖరి వన్డేకు దూరమయ్యాడు. యువ పేసర్ హర్షిత్ రాణా మోకాలి గాయంతో పాటు తొడ కండరాల గాయంతో ఇంగ్లాండ్ సిరీస్ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. మరోవైపు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తీవ్రమైన కండరాల గాయం కారణంగా జింబాబ్వే టీ20 సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు.
5, 6. నితీష్ కుమార్ రెడ్డి, కెప్టెన్ శుభ్మన్ గిల్..
యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తొడ కండరాల గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా జట్టును నడిపిస్తున్నాడు. తొలి వన్డేలో మెడ నొప్పి తాళలేక రిటైర్డ్ హర్ట్గా వెనక్కి తగ్గినా, తదుపరి మ్యాచ్లలో నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..