Virat Kohli : లార్డ్స్లో కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడా? సచిన్ 19 ఏళ్ల నాటి రికార్డు బద్దలయ్యేనా?

Virat Kohli : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే మూడో వన్డే మ్యాచ్ సరికొత్త చరిత్రకు వేదిక కాబోతోంది. లార్డ్స్ మైదానంలో జరిగే ఈ నిర్ణయాత్మక పోరులో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఏకంగా 19 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఒక రికార్డును తుడిచిపెట్టేందుకు కోహ్లీ ముంగిట నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక బ్యాటర్గా అవతరించేందుకు విరాట్ కోహ్లీ సర్వసన్నద్ధమయ్యాడు.
వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 15 వేల పరుగులు
వన్డే క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే.. ఇప్పటివరకు కేవలం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే 15 వేల పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్గా రికార్డుల్లో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో 2007వ సంవత్సరంలో ఆడిన 377వ వన్డే ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత గడిచిన 19 ఏళ్లలో ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లు వచ్చినప్పటికీ ఈ రికార్డును ఎవరూ అందుకోలేకపోయారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఈ రికార్డును అత్యంత సులువుగా, అతి తక్కువ ఇన్నింగ్స్ల్లోనే దాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.
లార్డ్స్ మైదానంలో సెంచరీ కొడితే సరికొత్త హిస్టరీ
ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో ఆడిన 301 ఇన్నింగ్స్లలో 14,867 పరుగులు చేశాడు. అతను 15 వేల పరుగుల క్లబ్లో చేరడానికి ఇంకా కేవలం 133 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే మ్యాచ్లో కోహ్లీ గనుక 133 పరుగులతో ఒక భారీ సెంచరీ గనుక సాధిస్తే, ప్రపంచంలోనే అత్యంత వేగంగా 15 వేల వన్డే పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. ఒకవేళ ఈ మ్యాచ్లో కుదరకపోయినా, రాబోయే ఇన్నింగ్స్లలో సచిన్ కంటే చాలా తక్కువ మ్యాచ్ల్లోనే కోహ్లీ ఈ ఘనత అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
300 వన్డే ఇన్నింగ్స్ల తర్వాత సచిన్ వర్సెస్ కోహ్లీ
వాస్తవానికి వన్డే క్రికెట్లో 300 ఇన్నింగ్స్లు ముగిసే సమయానికి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. తన మొదటి 300 వన్డే ఇన్నింగ్స్లు పూర్తయ్యేనాటికి విరాట్ కోహ్లీ ఏకంగా 14,802 పరుగులు సాధించాడు. ఇదే 300 ఇన్నింగ్స్ల సమయానికి సచిన్ టెండూల్కర్ కేవలం 12,015 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ గణాంకాలను బట్టి చూస్తే వన్డే ఫార్మాట్లో సచిన్ కంటే కోహ్లీ ఎంత వేగంగా పరుగులు సాధిస్తూ రన్ మెషిన్గా మారాడో స్పష్టంగా అర్థమవుతుంది.
యూకే పర్యటనలో పరువు కాపాడుకోవడమే లక్ష్యం
ఈ మ్యాచ్ కేవలం విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డుల కోసమే కాకుండా, టీమిండియా పరువు కాపాడుకోవడానికి కూడా అత్యంత కీలకంగా మారింది. జులై 19న జరిగే ఈ మ్యాచ్లో సిరీస్ గెలవడంతో పాటు బ్రిటన్ పర్యటనను గౌరవప్రదంగా ముగించాలని భారత జట్టు భావిస్తోంది. జూన్ 26 నుంచి ప్రారంభమైన ఈ యూకే పర్యటనలో భారత జట్టుకు వరుసగా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పర్యటన ప్రారంభంలో ఐర్లాండ్ జట్టు చేతిలో 0-2తో టీ20 సిరీస్ను కోల్పోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో 0-4తో టీ20 సిరీస్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురైన ఘోర పరాజయాలు
వరుసగా రెండు టీ20 సిరీస్లను క్లీన్స్వీప్స్ రూపంలో కోల్పోవడంతో భారత జట్టు ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఈ వన్డే సిరీస్ అయినా గెలిచి, యూకే పర్యటనలో తమ మొదటి సిరీస్ విజయాన్ని నమోదు చేయాలని టీమ్ ఇండియా కసిగా ఉంది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ను ఓడించి, కనీసం వన్డే సిరీస్ ట్రోఫీతోనైనా మంచి జ్ఞాపకాలతో బ్రిటన్కు గుడ్ బై చెప్పాలని జట్టు సభ్యులు పట్టుదలతో ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి