Reading Time: < 1 minute
Supreme Court Warns Against Spouses Complaining To Employer In Marital Disputes

Supreme Court: వైవాహిక విభేదాలు వచ్చినప్పుడు భర్త పనిచేసే సంస్థకు ఫిర్యాదు భార్య ఫిర్యాదు చేయడం, ఉద్యోగం ఊడేలా ప్రయత్నించడం ఎంత వరకు కరెక్ట్? దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యాభర్తల గొడవల సమయంలో చాలామంది మహిళలు భర్త యాజమాన్యానికి ఉత్తరాలు రాస్తున్నారని, ఇది చాలా తప్పుడు పద్ధతి అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఓ కేసుకు సంబంధించిన బదిలీ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకులు కోరడం వేరని, కానీ భాగస్వామి ఉపాధిని దెబ్బతీయడం అత్యంత దారుణమైన విషయమని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. భర్త ఉద్యోగం పోతే, ఆ తర్వాత ఆమెకు అందాల్సిన పోషణ ఖర్చుల (మెయింటెనెన్స్) దావాకు కూడా ఎలాంటి ఆధారం లేకుండా పోతుందని హెచ్చరించారు.

ఈ విచారణ వెనుక ఓ పెద్ద వివాదమే ఉంది. గజియాబాద్‌కు చెందిన ఓ మహిళ, తనపై అస్సాంలో నమోదైన పరువు నష్టం కేసును గజియాబాద్‌కు మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే గజియాబాద్‌లో భర్తపై అనేక కేసులు నడుస్తున్నాయని కోర్టుకు తెలిపింది. అయితే ఈ పరువు నష్టం కేసు నేరుగా భర్త వేసింది కాదు. ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన తన భర్త, సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా సొంత వ్యాపారం నడుపుతున్నాడంటూ సదరు మహిళ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త స్నేహితుడు, సహోద్యోగి ఈ పరువు నష్టం దావా వేశారు.

ఈ ఫిర్యాదు వెనుక తన వద్ద బలమైన కారణం ఉందంటూ మహిళ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భర్తే ముందుగా తమపై ఎయిర్ ఫోర్స్ హెల్మెట్ దొంగిలించారంటూ అసత్య ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు. ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికే తాను ఎయిర్ ఫోర్స్ అధికారులకు వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం, ఈ వ్యవహారాన్ని పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి (మీడియేషన్ సెంటర్) పంపింది. అంతేకాకుండా, గొడవలన్నీ సర్దుమనుచుకుని మోపిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సదరు మహిళకు సలహా ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదికి జస్టిస్ నాగరత్న సూచించారు.