July 21, 2026

Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్

Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
Reading Time: 2 minutes
Rohit Sharma Lords Century Retirement Rumors Mohammad Kaif

ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో (11, 27 పరుగులు), ఆయన రిటైర్మెంట్ గురించి తీవ్రస్థాయిలో ఊహాగానాలు వచ్చాయి. లార్డ్స్ వన్డే తర్వాత ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారనే పుకార్లు కూడా షికారు చేశాయి. అయితే, ‘హిట్‌మ్యాన్’ ఇప్పుడే రిటైర్ కావడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికి తగ్గట్టుగానే, లార్డ్స్ మైదానంలో 110 బంతుల్లో 138 పరుగులతో చారిత్రాత్మక సెంచరీ బాది రోహిత్ విమర్శకుల నోళ్లు మూయించారు. లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన మొదటి భారతీయ క్రికెటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు.

రోహిత్ రిటైర్మెంట్ ఊహాగానాలపై భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. “రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. ఇప్పుడు విమర్శకుల ముక్కు కట్ అయింది” అంటూ కైఫ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది ఆయనే నిర్ణయించుకుంటాడని, దేశం కోసం ఎంతో చేసిన ఆ హక్కు ఆయనకు ఉందని మద్దతుగా నిలిచారు. వన్డేల్లో దాదాపు 12 వేల పరుగులు, 34 సెంచరీలు చేసిన ఆటగాడిపై ఇంత ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు.

ప్రస్తుతం రోహిత్‌కు ఎవరి మద్దతు లభించడం లేదని, ఆయన ఒంటరిగా పోరాడుతున్నారని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్, లేదా బీసీసీఐ మీడియా ముందుకు వచ్చి “2027 వన్డే ప్రపంచకప్‌లో మాకు రోహిత్ శర్మ కావాలి, ఆయన ఎంతకాలం అనుకుంటే అంతకాలం ఆడవచ్చు” అని బహిరంగంగా ప్రకటిస్తే, రోహిత్ ఆత్మవిశ్వాసం హిమాలయమంత ఎత్తుకు ఎదుగుతుందని కైఫ్ పేర్కొన్నారు. అందరూ ఆయన ఎప్పుడు ఫెయిల్ అవుతాడా, ఎప్పుడు జట్టు నుంచి తీసేద్దామా అని ఎదురుచూస్తున్న తరుణంలోనే ఈ శతకం వచ్చిందని గుర్తుచేశారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ కంటే ముందైనా రోహిత్‌ను ప్రశాంతంగా ఆడనివ్వాలని కోరారు.

మరోవైపు, రోహిత్ శర్మ మాట్లాడుతూ మైదానం వెలుపల జరిగే ఈ విమర్శల ‘సందడి’ గురించి తనకు తెలుసని, కానీ అది తనను ఏమాత్రం ప్రభావితం చేయదని స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభం నుండి ఇవి వింటున్నానని, మ్యాచ్‌లో జట్టు కోసం రాణించడమే తన బాధ్యతని రోహిత్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల నుండి తప్పుకున్న రోహిత్.. భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.