July 21, 2026

Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..

Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
Reading Time: < 1 minute
Telangana Wins 200 Crore Incentive Maternal Child Healthcare

మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో అత్యుత్తమ గుర్తింపు సాధించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కనబరిచిన అద్భుతమైన పనితీరును మెచ్చిన కేంద్ర ప్రభుత్వం, అందుకు ప్రోత్సాహకంగా రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. కేంద్రం నుంచి అందిన ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు, వైద్య మౌలిక వసతుల విస్తరణకు పూర్తిగా వినియోగించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశు సంరక్షణ విభాగాలను విస్తరించనున్నారు. అలాగే ప్రసవ గదులు (లేబర్ రూములు), ఆపరేషన్ థియేటర్లను జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. వీటితో పాటు మిడ్‌వైఫరీ-లెడ్ కేర్ యూనిట్లు, కంగారూ మదర్ కేర్ వార్డులు, లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్లను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా అధిక ప్రసవాలు జరిగే ఏరియా ఆసుపత్రుల్లో తల్లి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అభివృద్ధి పరిచి, నేషనల్ క్వాలిటీ అష్యూరన్స్ సర్టిఫికేషన్ పొందేలా మౌలిక వసతులను కల్పించనున్నారు. ఈ నిధుల సహాయంతో చేపట్టే ఉచిత వైద్య సేవలు, ఆధునికీకరణ పనులు రాష్ట్రంలో మాతృ మరణాలు, నవజాత శిశు మరణాల రేటును మరింతగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో చేరే ప్రతి గర్భిణీకి, పుట్టిన బిడ్డకు అత్యుత్తమ వైద్యం ఉచితంగా అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ ప్రోత్సాహం వైద్య సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని, రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని జాతీయ ప్రమాణాలకు చేర్చడంలో ఇది ఎంతో దోహదపడుతుందని కమిషనర్ వివరించారు.