Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు

జార్ఖండ్లోని జంషెడ్పూర్లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 5 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా హోంగార్డు ఆసుపత్రి ప్రాంగణంలో కన్నీటి పర్యంతమవుతూ “దయచేసి నా జీతం ఇవ్వండి… లేకపోతే నేను చనిపోతా” అంటూ వేడుకోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు
జంషెడ్పూర్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (MGM) మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో భద్రతా విధులు నిర్వహిస్తున్న 135 మంది హోంగార్డులు గత 5 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విధుల్లోనే ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా హోంగార్డు
జూలై 8న మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డు అలాదిన్ మహాలి క్యాంపస్లో ఉన్న ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సహచరులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. చికిత్స సమయంలో మాట్లాడిన ఆమె, 5 నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబం ఆకలితో అలమటిస్తోందని తెలిపింది. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ చికిత్స చేయించేందుకు డబ్బు లేదని, కుమారుడి స్కూల్ ఫీజు కూడా చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మరో మహిళా హోంగార్డు కన్నీటి పర్యంతం
ఈ ఘటన మరువకముందే జూలై 18న మరో మహిళా హోంగార్డు ఫుల్కుమారి హెంబ్రామ్ ఆసుపత్రి ప్రాంగణంలో కన్నీళ్లు పెట్టుకుంది. “ఐదు నెలలుగా వేతనం అందలేదు. కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారింది. నాకు కడుపు సంబంధిత తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంది. కానీ డాక్టర్ కు చూపించడానికి, మందులు కొనడానికి కూడా నా వద్ద డబ్బు లేదు. దయచేసి నా జీతం ఇప్పించండి… లేదంటే నేను చనిపోతా” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.
యాజమాన్యం ఏమంది?
మొదటి ఘటన అనంతరం MGM మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధిత మహిళా హోంగార్డును పరామర్శించారు. ఆమెకు తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించారు. వేతనాల చెల్లింపుపై ఇప్పటికే సంబంధిత శాఖకు లేఖ రాశామని, అయితే ప్రధాన కార్యాలయం నుంచి బడ్జెట్ నిధులు ఇంకా విడుదల కాలేదని తెలిపారు. నిధులు విడుదలైన వెంటనే 135 మంది హోంగార్డుల పెండింగ్ వేతనాలను ప్రాధాన్య క్రమంలో పూర్తిగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తీవ్ర చర్చకు దారితీసిన ఘటన
వరుసగా ఇద్దరు మహిళా హోంగార్డులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవడం జార్ఖండ్లో ప్రభుత్వ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో ప్రాణాలపై ఆశలు కోల్పోయే స్థితికి ఉద్యోగులు చేరుకోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
खाकी वर्दी के पीछे जो महिला है वो तनख्वाह न मिलने के दर्द में है । एमजीएम अस्पताल में एक महिला होमगार्ड का फफक-फफक कर रोना व्यवस्था की असंवेदनशीलता को उजागर करता है। पांच महीने से वेतन का इंतजार, ऊपर से गंभीर बीमारी का बोझ—यह कैसी परीक्षा है? क्या उसकी मेहनत का मोल केवल खामोशी और… pic.twitter.com/fHbPSaZCcn
— mukesh kumar (@Mukesh_Ranchi) July 18, 2026