July 19, 2026

టీటీడీ గోశాలలో కలకలం.. శ్రీవారి సేవ చేయక ముందే గుర్రం మృతి.. విరాళం ఇచ్చిన వారానికే..

టీటీడీ గోశాలలో కలకలం.. శ్రీవారి సేవ చేయక ముందే గుర్రం మృతి.. విరాళం ఇచ్చిన వారానికే..
Reading Time: 2 minutes
టీటీడీ గోశాలలో కలకలం.. శ్రీవారి సేవ చేయక ముందే గుర్రం మృతి.. విరాళం ఇచ్చిన వారానికే..

ఆపదమొక్కుల వాడికి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించే భక్తులే కాదు.. గోవులు, ఇతర జంతువులు అందించి శ్రీవారి సేవ చేయాలని ముందుకు వస్తున్న దాతలు ఉన్నారు. ఇలాంటి దాత నుంచే ఈ నెల 13న టీటీడీ ఎస్‌వీ గోశాల మగ గుర్రం విరాళంగా వచ్చింది. మధురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ టీటీడీ ఎస్‌వీ గోశాలకు 9ఏళ్ల వయస్సు ఉన్న మార్వాడి జాతికి చెందిన తెల్లని మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయానికి తరచూ గుర్రాలను దానంగా సమర్పిస్తూ వచ్చిన భక్తుడు ఈసారి శ్రీవారికి గుర్రాన్ని కానుకగా ఇవ్వాలనుకున్నాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తాను ఇచ్చిన గుర్రాన్ని చూడాలన్న కోరికతో మగ గుర్రాన్ని దానంగా అందజేసిన భక్తుడు.. తన కోరికను తీర్చుకున్నాడు.

ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి సేవలో వినియోగించు కోవాలని టిటిడి భావించింది. ఎస్వీ గోశాలలో విరాళం ఇచ్చిన గుర్రంతో కలుపుకుని 5 గుర్రాలు గోశాలలో ఉన్నాయని డైరెక్టర్ డా. ఏ.వి.ఎస్. శివకుమార్ తెలిపారు. అయితే వారం తిరగక ముందే ఆ మగ గుర్రం మృతి చెందింది. గుర్రం మరణానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు శవపరీక్ష నిర్వహించి, అవసరమైన నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు గోశాల డైరెక్టర్ వెల్లడించారు.

క్వారంటైన్‌లో ఉంచి నిరంతర వైద్యుల పర్యవేక్షణ

ఈ నెల 13న గోశాలకు చేరిన వెంటనే గుర్రాన్ని క్వారంటైన్‌లో ఉంచి, రక్తం, పేడ నమూనాలను తిరుపతిలోని రాష్ట్ర స్థాయి పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పంపించారు. ప్రాథమిక పరీక్షల్లో గుర్రం దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడైందని తెలిపారు. గుర్రం గోశాలకు వచ్చినప్పటి నుంచే మేత, నీరు సరిగా తీసుకోకపోవడం, మాటి మాటికి కూర్చోవడం, పడుకోవడం, దొర్లడం, తిరిగి లేవడం వంటి అస్వస్థత లక్షణాలను గమనించారు. వెంటనే గోశాల పశువైద్యుల పర్యవేక్షణలో నిపుణుల సూచనల మేరకు అవసరమైన వైద్య చికిత్సలు, ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ఇలా అన్ని విధాలుగా వైద్య చికిత్సలు అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోగా చికిత్సకు స్పందించలేక పోయింది. నిన్న ఉదయం 10 గంటలకు గుర్రం మృతి చెందినట్లు అధికారులు వివిరించారు. నిన్న మధురైకి చెందిన దాత షణ్ముగం కూడా ఎస్వీ గోశాలకు రాగా ఆయన సమక్షంలోనే గుర్రం మృతి చెందిందని పేర్కొన్నారు.

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణుల బృందం సమక్షంలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేసారు. ప్రాథమికంగా గుర్రం దీర్ఘకాలిక కాలేయం, హృదయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. తుది శవపరీక్ష నివేదిక అందిన అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణం వెల్లడి కానుందని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..