Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం

దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? అంటూ పోలీసులపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో సోషల్ మీడియాలో మండిపడ్డారు. జంతర్మంతర్ దగ్గర విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అరిజిత్ సింగ్ తీవ్ర ఆవేదన చెందారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే అరిజిత్ సింగ్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును ప్రశ్నించారు.
అరిజిత్ తన పోస్టులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘‘విద్యార్థులను చంపేస్తున్నారు. మీకు సిగ్గు లేదా? నేతలు, మంత్రులు… అసలు ఏమి జరుగుతోంది? మీరే దేవుళ్లమని అనుకుంటున్నారా? జరిగిన ప్రతి విషయం ప్రజలు గుర్తుంచుకుంటారు. హర్ హర్ మహాదేవ్! ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మార్పే అని గుర్తుంచుకోండి.’’ అని వ్యాఖ్యానించారు. మరో పోస్టులో పోలీసుల తీరును తప్పుబడుతూ.. ‘‘యూనిఫాంలో ఉన్న మనుషులు గూండాల్లా ప్రవర్తిస్తున్న వీడియోలు చూస్తున్నాను.’’ అంటూ మండిపడ్డారు.
ఇప్పటికే జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న లడఖ్కు చెందిన విద్యా సంస్కర్త, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్కు కూడా అరిజిత్ సింగ్ మద్దతు ప్రకటించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి వాంగ్చుక్ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ సోమవారం హింసాత్మకంగా మారింది. పార్లమెంట్ వైపు కదిలిన నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటనలో 118 మంది పోలీసు సిబ్బంది గాయపడగా… సుమారు 60 మంది నిరసనకారులు కూడా గాయపడ్డారు. హింస, రాళ్ల దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన 250కిపైగా వీడియోలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను సఫ్దర్జంగ్ ఆస్పత్రి నుంచి తనకు నచ్చిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మెడాంటా ఆస్పత్రి వైద్యులు సూచించిన చికిత్సను తప్పనిసరిగా పాటించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. నిరాహార దీక్ష కారణంగా వాంగ్చుక్ ఇప్పటికే 9 కిలోలకు పైగా బరువు తగ్గినట్లు వైద్యులు వెల్లడించారు. అరిజిత్ సింగ్తో పాటు బాలీవుడ్ ప్రముఖులు షబానా ఆజ్మీ, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, ఇమ్రాన్ ఖాన్, భూమి పెడ్నేకర్, సోనం బజ్వా, హుమా ఖురేషీ, రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దేశ్ముఖ్, రోహిత్ సరాఫ్ తదితరులు కూడా సోషల్ మీడియా ద్వారా నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.

