పీజీఐ ర్యాంకింగ్లో సింగిల్ డిజిట్ సాధించడమే లక్ష్యం : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్త పెర్ఫార్మింగ్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) ర్యాంకింగ్స్లో తెలంగాణ సింగిల్ డిజిట్ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా అధికారులకు సూచించారు. సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో ప్రారంభమైన రెండ్రోజుల రాష్ట్ర స్థాయి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్తో కలిసి ఆమె వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం పీజీఐ ర్యాంకింగ్స్లో 2024–25 నాటికి 28వ స్థానంలో ఉండగా, 2025–26 నాటికి 18వ స్థానానికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కచ్చితంగా టాప్-10లో ఉండాలన్నది సీఎం విజన్ అని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘యూడైస్ ప్లస్’ వంటి ప్లాట్ఫామ్స్లో పక్కాగా, సమయానికి డేటాను నమోదు చేయాలని హెచ్చరించారు.
ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) మిషన్ను పకడ్బందీగా అమలు చేస్తూ పాఠశాలల్లో అకడమిక్ ప్రమాణాలు పెరిగేలా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ పీజీఐ ఫ్రేమ్వర్క్లో రాష్ట్రంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జనగామ, మంచిర్యాల జిల్లాల ప్రతినిధులను అభినందించారు. ఎఫ్ఎల్ఎన్ శాంపిల్ స్టడీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి, వనపర్తి, నారాయణపేట జిల్లాల పనితీరును ప్రశంసించారు.