India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు

India First Dengue Vaccine: వర్షాకాలం ప్రారంభమైతే దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతుంటాయి. ప్రతి ఏడాది వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో తొలిసారిగా డెంగ్యూ నివారణ కోసం ‘QDENGA’ (క్యూడెంగా) వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం లభించింది.
వ్యాక్సిన్ ప్రత్యేకత ఏంటి? ఏ ఏజ్ వారికి..
ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే, టీకా తీసుకునే ముందు డెంగ్యూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో డెంగ్యూ వచ్చినవారు అయినా, ఎప్పుడూ డెంగ్యూ రాకపోయినా ఈ టీకాను తీసుకోవచ్చు. దీంతో డెంగ్యూ నివారణలో ఇది ఒక కీలక ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. QDENGA వ్యాక్సిన్ను రెండు డోసులుగా ఇస్తారు. మొదటి డోస్ తీసుకున్న మూడు నెలల తర్వాత రెండో డోస్ వేయించుకోవాలి. ఈ టీకాను చర్మం కింద (సబ్క్యూటేనియస్) ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. జపాన్కు చెందిన ఔషధ సంస్థ టకేడా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ను 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారికి వినియోగించేందుకు అనుమతించారు.
భారత్లో డెంగ్యూ కేసులు ఎక్కువ..!
ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యే దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచ డెంగ్యూ భారంలో దాదాపు మూడింట ఒక వంతు కేసులు భారతదేశంలోనే నమోదవుతున్నట్లు అంచనా. గత రెండు దశాబ్దాల్లో దేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2025లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా.
నాలుగు వైరస్లకు వాక్సిన్..
డెంగ్యూ వైరస్కు నాలుగు రకాల (సెరోటైప్స్) ఉన్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు రకాల వైరస్ల నుంచి రక్షణ కల్పించేలా QDENGAను రూపొందించారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వ్యాక్సిన్పై 28 వేల మందికి పైగా క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. రెండో డోస్ తర్వాత 12 నెలలకు డెంగ్యూ నివారణలో 80.2 శాతం ప్రభావవంతంగా, డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని 90.4 శాతం వరకు తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేసిందని అధ్యయనాలు సూచించాయి. దీర్ఘకాలిక పరిశోధనల్లో కూడా 4.5 సంవత్సరాల తర్వాత ఆసుపత్రి చికిత్స అవసరాన్ని 84.1 శాతం వరకు తగ్గించినట్లు గుర్తించారు.
WHO సిఫార్సు..
ఈ వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే సిఫార్సు చేసింది. నాణ్యత, భద్రత, ప్రభావం వంటి అంతర్జాతీయ ప్రమాణాలను ఇది అందుకుందని WHO ప్రీక్వాలిఫికేషన్ కూడా పొందింది. ప్రస్తుతం భారత్తో పాటు 43 దేశాల్లో ఈ వ్యాక్సిన్కు అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3.2 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ప్రజారోగ్య టీకా కార్యక్రమాల్లో దీనిని వినియోగిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అయితే టీకా తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, దోమల నివారణ మందులు, దోమతెరలు ఉపయోగించడం కొనసాగించాలి. అధిక జ్వరం, ఒళ్లునొప్పులు, ప్లేట్లెట్లు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.