July 21, 2026

West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్‌లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!

West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్‌లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
Reading Time: < 1 minute
West Bengal Bengali Language Mandatory From September 1

West Bengal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భాషా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సేవల్లో, అధికారిక సమాచార వ్యవస్థల్లో ఇకపై బెంగాలీ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి తాజాగా ప్రకటించారు. ఈ కొత్త రూల్ 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంతో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల కోసం హిందీని కూడా ఉపయోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

తాజాగా సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి పౌర సేవలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యవస్థలు, దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలు, ప్రభుత్వ పోర్టల్స్, వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, శిక్షణా సామగ్రి, ప్రభుత్వ ప్రకటనలు, పబ్లిక్ సైన్‌బోర్డులు, అధికారిక సమాచార ప్రసారాలు వంటి అన్ని వేదికల్లో బెంగాలీ భాష వినియోగం తప్పనిసరి కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వ హయాంలో 2011లో జస్టిస్ సుశాంత ఛటర్జీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను విడుదల చేసినట్లు తెలిపారు. ఆ నివేదిక సిఫారసుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. భూమి, భూ సంస్కరణల శాఖ నుంచి సీఎం కార్యాలయం వరకు ప్రభుత్వ వ్యవహారాలన్నీ బెంగాలీ భాషలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అలాగే పౌర సేవలు, అఫిడవిట్లు, ప్రభుత్వ యాప్‌లు, పౌర పత్రాలు, ఎఫ్‌ఐఆర్‌లు, నోటిఫికేషన్‌లు వంటి అధికారిక పత్రాల్లో కూడా బెంగాలీ భాషనే వినియోగించనున్నట్లు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం అమలుపై వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాసిన లేఖను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పరిపాలన, విద్య, ప్రజా జీవితంలో భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, ప్రజల భాషలోనే పరిపాలన జరిగితే పాలన మరింత సమర్థవంతంగా, ప్రజాకేంద్రీకృతంగా ఉంటుందని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విశ్వసించారని అమిత్ షా ఈ లేఖలో పేర్కొన్న విషయాన్ని ఆయన చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భాషా పరిరక్షణ దిశగా కీలక అడుగుగా భావిస్తున్నప్పటికీ, దీనిపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.