‘ఇప్పుడే మెగా కుటుంబానికి నేను అర్హురాలిననే గర్వం కలిగింది’.. నిహారిక ఎమోషనల్ కామెంట్స్!

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా బాక్సాఫీస్ వద్దే కాదు.. జాతీయ స్థాయిలోనూ గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ తెలుగు చిత్రం అవార్డుతో పాటు, పీ. రవి కుమార్కు ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డులు వరించాయి.ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్రబృందం నిర్వహించిన సెలబ్రేషన్ ఈవెంట్లో నిహారిక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు .
నా 32 ఏళ్ల జీవితంలో నేను ఇంత సంతృప్తిగా ఎప్పుడూ అనిపించుకోలేదు. ‘కమిటీ కుర్రోళ్ళు’ కథ విన్న క్షణం నుంచే ఇది హృదయానికి దగ్గరైన సినిమా అని నమ్మాను. మంచి సినిమాలు తీయడమే ఇలాంటిది అయితే నేను సినిమా పరిశ్రమను ఎప్పటికీ విడిచిపెట్టను అంటూ నిహారిక ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు యదు వంశీ ఈ చిత్రం జాతీయ అవార్డుకు అర్హమైన కథ అని మొదటి నుంచే చెప్పేవారని, అయితే తాను అవార్డు గురించి ఆలోచించలేదని తెలిపారు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత మాత్రం ఈ సినిమా జాతీయ స్థాయిలో నిలవాలని తన విజన్ బోర్డులో రాసుకున్నానని, ఇప్పుడు అది నిజం కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
అలాగే తన కుటుంబం గురించి మాట్లాడిన నిహారిక.. 36 ఏళ్ల క్రితం మా నాన్న నాగబాబు నిర్మించిన ‘రుద్రవీణ’ మూడు జాతీయ అవార్డులు గెలుచుకుంది. పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ తమ కెరీర్తో కుటుంబానికే కాదు.., తెలుగు సినీ పరిశ్రమకు కూడా గొప్ప సేవ చేశారు. కానీ నేను మాత్రం ఇప్పటివరకు మెగా కుటుంబంలో ఉన్నాననే భావన మాత్రమే ఉండేది. ఇప్పుడు ‘కమిటీ కుర్రోళ్ళు’ వల్ల నిజంగా ఆ కుటుంబానికి తగిన వ్యక్తిననే గర్వం కలిగింది అంటూ ఎమోషనల్ అయ్యారు.
2015లో స్థాపించిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ విజయంతో పాటు జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది.. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ కంటెంట్కు ప్రాధాన్యం ఇచ్చిన ఈ సినిమా, నిహారికను నిర్మాతగా మరో మెట్టుపై నిలబెట్టిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.