Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..

Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ‘‘పార్లమెంట్ మార్చ్’’ సోమవారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న వారిని అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయితే, తమపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రతీ విషయంలో కోర్టును ఇందులోకి లాగొద్దు అంటూ పిటిషనర్కు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును బుధవారం విచారణకు జాబితాలో చేర్చుతామని తెలిపింది.
పిటిషనర్ తరుపు న్యాయవాది, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల అధిక బలప్రయోగం చేశారని అందుకే అత్యవసర విచారణ అవసరమని కోర్టును కోరారు. సోమవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వద్దకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. కొందరు నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ మొత్తం ఘర్షణల్లో 178 మంది గాయపడ్డారు. 118 మంది పోలీస్ సిబ్బంది, సీనియర్ అధికారులు కూడా గాయపడ్డారు. మరో 60 మంది నిరసనకారులు ఉన్నారు.