July 20, 2026

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్‌లో కీలక పరిణామం..

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్‌లో కీలక పరిణామం..
Reading Time: 2 minutes
Dmk Delimitation Bill Support All Party Meeting Stalin

Delimitation Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘‘డీలిమిటేషన్’’ బిల్లుకు డీఎంకే నుంచి మద్దతు లభించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌లో బిల్లుకు మద్దతు తెలిపిందని ఆర్ఎస్పీ లోక్‌సభ ఎంపీ ఎస్కే ప్రేమచంద్రన్ చెప్పడం సంచలనంగా మారింది. అయితే, ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వలేదని డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివ స్పష్టం చేశారు.

ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు డీఎంకే ‘‘నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లు’’కు మద్దతు తెలిపిందని అన్నారు. దీనిపై తిరుచి శివ మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రతిపాదన తీసుకురాలేదని, దక్షినాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకూడదని, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే అమలు చేయాలని, డీలిమిటేషన్ విషయంలో కేంద్రం వైఖరిపై మరింత స్పష్టత కావాలని అన్నారు.

50 శాతం పెంపుకు డీఎంకే ఓకే

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో లోక్‌సభ మౌఖికంగా చెప్పినట్లు అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతామని బిల్లులో స్పష్టంగా పేర్కొంటే దానిని సానుకూలంగా పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీఎంకే చెప్పింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే అంశాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడున్న రాజకీయ ముఖచిత్రం ప్రకారం చూస్తే బీజేపీకి మూడింట రెండొంతుల మద్దతు సంఖ్యా బలం లభించే అవకాశం ఉంది.

సంఖ్యా బలంపై బీజేపీ ఫోకస్:

డీలిమిటేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు కిందకు వస్తుండటంతో, ఈ బిల్లు పాస్ కావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 319 మంది ఎంపీల మద్దతు ఉంది. బిల్లు ఆమోదానికి 360 మంది మద్దతు కావాలి. మరో 41 ఓట్లు తక్కువగా ఉన్నాయి. లోక్‌సభలో డీఎంకేకు 22 మంది ఎంపీలు ఉన్నారు. డీఎంకే మద్దతు ఇస్తే లేదా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా ఎన్డీయే బిల్లు ఆమోదం పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

850 స్థానాలకు పెరగనున్న లోక్‌సభ సంఖ్య:

2026లో ప్రతిపాదించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కు పెంచుతుంది. ఈ స్థానాలు పెరిగిన తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఎన్డీయే సర్కార్ భావిస్తోంది. అయితే, గతంలో ఈ బిల్లును దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు 50 శాతం స్థానాలు పెంచే ప్రతిపాదనపై దక్షిణాది పార్టీలు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.