Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..

Delhi: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు విద్యార్థులు, నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులపై అణచివేతకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ నాయకులు లోక్కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పవన్ ఖేరా, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షులు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ హూడా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థుల్ని బీజేపీ ప్రభుత్వం క్రూరంగా హింసించిందని, కానీ బాధ్యత వహించడానికి, పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతల ధర్నాతో ఒక్కసారిగా ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ ధర్నా చేస్తున్న ప్రదేశానికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నచ్చచెప్పేలా ప్రయత్నిస్తున్నారు. రాహుల్తో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.