Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!

Khadgam Re Release: తెలుగు సినీ చరిత్రలో దేశభక్తి, ప్రేమ, స్నేహం అన్నింటినీ ఒకే కథలో అద్భుతంగా చూపించిన సినిమాలలో ‘ఖడ్గం’ ఒకటి. దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన ఈ క్లాసిక్ మూవీ 2002 లో విడుదలై సంచలనం సృష్టించింది. రెండు దశాబ్దాలు దాటిపోయినా, ప్రేక్షకుల హృదయాల్లో దాని స్థానం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా టెలివిజన్లో ప్రసారమవుతూ కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ‘ఖడ్గం’ను గ్రాండ్గా రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం రీ రిలీజ్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘ఖడ్గం’ కూడా మరోసారి థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందించనుంది.
2002లో విడుదలైన ఈ చిత్రంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ఎమోషన్, బలమైన కథనం, తూటాలులా పేలే డైలాగ్స్ ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలబెట్టాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం పోరాడే యువకుడి కలలు, మరోవైపు దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడే మనస్తత్వం, ఇంకోవైపు మత సామరస్యంపై దర్శకుడు చెప్పిన సందేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుంది. అందుకే ‘ఖడ్గం’ను కమర్షియల్ సినిమాగా కాకుండా ఒక భావోద్వేగ ప్రయాణంగా సినీ అభిమానులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం గురించి కూడా చెప్పుకోవాల్సిందే. సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. దేశభక్తిని రగిలించే సన్నివేశాల్లో వినిపించే సంగీతానికి ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి కూడా. అందుకే ఈ సినిమా టెలివిజన్లో ప్రసారమైన ప్రతిసారీ మంచి ఆదరణను అందుకుంటూ వస్తోంది.
ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీని పాప్కార్న్ ప్రొడక్షన్స్ బ్యానర్పై దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణుమొలకల నక్షత్ర నిర్మాతగా, కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహ నిర్మాతలుగా మరోసారి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పాత క్లాసిక్ సినిమాల రీ రిలీజ్లు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అదే జోష్తో ఇప్పుడు ‘ఖడ్గం’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేశభక్తి భావోద్వేగాలను మళ్లీ గుర్తుచేసే ఈ సినిమాకు,స్వాతంత్య్ర దినోత్సవ వేళ థియేటర్లలో మరోసారి చప్పట్లు మార్మోగబోతున్నాయి.