Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!

Ashwin Feels Rohit And Kohli Cannot Be Touched: టీమిండియా సీనియర్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ఇటీవల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటన అనంతరం హిట్మ్యాన్ను జట్టులో కొనసాగించరనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఊహాగానాల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ అద్భుత సెంచరీ (138)తో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. దిగ్గజాలు రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి తప్పించడం అంత ఈజీ కాదు అని పేర్కొన్నాడు. రో-కోలను తప్పిస్తే అభిమానులు స్టేడియం పైకప్పు లేపేస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
తప్పించడం చాలా చాలా కష్టం:
ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ షో ‘ఆష్ కి బాత్’లో మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లీ గురించి చెప్పేదేముంది. రెండవది.. రో-కోల అభిమానుల బలం. రోహిత్, కోహ్లీ మ్యాచ్లు ఆడితే వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు వస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పిస్తే స్టేడియం పైకప్పే లేచిపోతుంది’ అంటూ తనదైన శైలిలో చెప్పాడు.
బౌలర్ల పరిస్థితి భిన్నం:
బౌలర్ల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంటుందని ఆర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా’ అని యాష్ తెలిపాడు. అశ్విన్ స్టార్ హోదాను అనుభవించిన వాడే. భారత జట్టులో మాత్రమే కాదు.. ఐపీఎల్లో కూడా ఓ వెలుగువెలిగాడు. అశ్విన్ కూడా బౌలర్ కాబట్టి.. బౌలర్లకు కూడా భారీగా అభిమానులు ఉండాలని కోరుతున్నాడు.
110 బంతుల్లో 138 పరుగులు:
ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ తన క్లాస్ను మరోసారి నిరూపించాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైనా.. మూడో మ్యాచ్లో 110 బంతుల్లో 138 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు చివరి వరకు ఆశలు నిలిపిన రోహిత్.. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. రోహిత్ ప్రదర్శనతో అతని రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.