Reading Time: < 1 minute
Mancherial Farmers Death Luxettipet Storm Shed Collapse Telangana

Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని లక్షెట్టిపేటలో భారీ ఈదురుగాలుల కారణంగా రేకుల షెడ్డు కుప్పకూలి ముగ్గురు రైతులు మృతి చెందారు. మృతులను వెంకటేష్, అభిరామ్, లచ్చన్నగా గుర్తించారు. ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈదురుగాలుల తీవ్రత కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

“మంచిర్యాల జిల్లాలో నిన్న రెండు వేర్వేరు సంఘటనల్లో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం, ఈదురుగాలుల ధాటికి గోడలు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందడం, పలువురు రైతులు గాయాల పాలవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన రైతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. వారాల తరబడి పండించిన పంట కొనకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మూడు రోజుల్లోనే వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద ఏడుగురు రైతులు మరణించారు. ఇవన్నీ రాష్ట్ర సర్కారు చేసిన హత్యలే. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అన్ని పంటలు రాష్ట్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తున్నాను.” అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.