
భారతదేశ ఎన్నికల ముఖచిత్రం ప్రస్తుతం భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా జన్-జీ (Gen-Z) , మిల్లీనియల్ తరం ఓటర్లు రాజకీయ గమనాన్ని మార్చే నిర్ణాయక శక్తులుగా అవతరించారు. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు యువత ఆలోచనా ధోరణి ప్రాంతీయ రాజకీయాల పునాదులను కదిలిస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు 2.28 కోట్ల మంది యువ ఓటర్లు (20-40 ఏళ్ల వారు) ఈసారి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచించారు. గత ఆరు దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే సాగుతున్న పీఠాలాటను చూసి విసిగిపోయిన యువతకు, నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఒక ప్రత్యామ్నాయంగా కనిపించింది. డ్రగ్స్ రహిత రాష్ట్రం, గ్యారంటీ ఉద్యోగాలు, తనఖా లేని విద్యారుణాలు వంటి వాగ్దానాలు నేరుగా యువత అవసరాలను తాకాయి. కేవలం సినిమా అభిమానానికే పరిమితం కాకుండా, తమ అభిమాన నటుడిని రాజకీయ వేదికపైకి తీసుకురావడం ద్వారా తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని జెన్-జీ తరం భావించింది. స్టాలిన్ పాలనలో ఎదురైన నిరుత్సాహం వీరిని కొత్త నాయకత్వం వైపు నడిపించింది.
ఇతర రాష్ట్రాల్లో యువత పోకడలు..
తమిళనాడులో మార్పు కోసం ప్రయత్నిస్తే, మిగిలిన రాష్ట్రాల్లో యువత తమ సమస్యల ప్రాతిపదికన స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో.. స్కూల్ సర్వీస్ కమిషన్ నియామకాల రద్దు యువతలో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. కోటి మందికి పైగా ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వ నగదు పథకాలను లంచంగా భావించి తిరస్కరించడం విశేషం. అస్సాంలో దాదాపు 29 శాతం ఉన్న యువ ఓటర్లు తమ అస్తిత్వం కోసం ఓటు వేశారు. పౌరస్మృతి ఆందోళనలతో పెరిగిన చైతన్యం ఇక్కడ బీజేపీకి మూడోసారి అధికారాన్ని అందించడంలో కీలకమైంది.
కేరళలో.. విద్యావంతులైన యువత ‘నాణ్యమైన పరిపాలన’కు పట్టం కట్టారు. సోషల్ మీడియా ప్రభావం.. మౌలిక సదుపాయాల కల్పనపై వారు చూపిన ఆసక్తి ఫలితాలను తారుమారు చేసింది. మొత్తానికి.. ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో యువత ఒక నిశ్శబ్ద విప్లవమని నిరూపించాయి.