
రోహిత్ శర్మ కెప్టెన్ గా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో వరుసగా రెండు సార్లు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ర్యాంకింగ్స్ వివరాలు..
తాజా ఐసీసీ వార్షిక అప్డేట్ ప్రకారం.. మే 2025 నుంచి ఆడిన మ్యాచ్లకు 100 శాతం, అంతకుముందు రెండేళ్లలో ఆడిన మ్యాచ్లకు 50 శాతం వెయిటేజీని ఇచ్చారు.
భారత్: 275 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఇంగ్లాండ్: 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా: 258 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
గత రెండేళ్లుగా టీ20 ఫార్మాట్లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. 2024, 2026 ప్రపంచకప్లు గెలవడమే కాకుండా.. ఈ రెండు టోర్నీల మధ్య జరిగిన అన్ని ద్వైపాక్షిక సిరీస్లలోనూ భారత్ అజేయంగా నిలిచింది.
ఇతర జట్ల పరిస్థితి..
ర్యాంకింగ్స్లో మొదటి ఏడు స్థానాల్లో ఎటువంటి మార్పు లేదు. న్యూజిలాండ్ (4), దక్షిణాఫ్రికా (5), పాకిస్థాన్ (6), వెస్టిండీస్ (7) వరుస స్థానాల్లో ఉన్నాయి. అయితే.. శ్రీలంక ఆరు రేటింగ్ పాయింట్లను కోల్పోయి 9వ స్థానానికి పడిపోగా, ఒక పాయింట్ సాధించిన బంగ్లాదేశ్ 8వ స్థానానికి ఎగబాకింది. అఫ్గానిస్తాన్ 10వ స్థానంలో నిలవగా, జింబాబ్వే (11), ఐర్లాండ్ (12) తమ స్థానాలను కాపాడుకున్నాయి.
పుంజుకున్న చిన్న జట్లు..
క్రికెట్లో ఎదుగుతున్న అమెరికా (USA) ఆరు పాయింట్లను సాధించి 13వ స్థానానికి చేరుకుంది. నెదర్లాండ్స్, స్కాట్లాండ్లను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. నేపాల్, ఒమన్ జట్లు కూడా ఒక్కో స్థానం మెరుగుపరుచుకుని వరుసగా 17, 19 స్థానాల్లో నిలిచాయి.
ముఖ్యంగా తొలిసారి ప్రపంచకప్లో అడుగుపెట్టిన ఇటలీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నేపాల్పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఇటలీ, 11 పాయింట్లను తన ఖాతాలో వేసుకుని 26 నుంచి 23వ ర్యాంకుకు చేరుకుంది. చివరగా.. గత మూడేళ్లలో కనీసం ఎనిమిది మ్యాచ్లు ఆడలేకపోయిన కారణంగా ఫిజీ, గాంబియా, గ్రీస్, ఇజ్రాయెల్ జట్లు ర్యాంకింగ్స్ జాబితా నుంచి తప్పుకున్నాయి. దీనివల్ల ర్యాంకింగ్స్లోని మొత్తం జట్ల సంఖ్య 102 నుండి 98కి తగ్గింది.