
టాలీవుడ్ సినీ లిరిసిస్ట్ చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే, రాజేందర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 60 ఏళ్ల రాజేందర్ ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా, కలికిరిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భార్య దుండిగల్ పోలీస్ స్టేషన్లో సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కలికిరి పోలీస్ స్టేషన్కు ఈ కేసును బదిలీ చేశారు. ఇక తన భర్త రాజేందర్తో పాటు శ్రీనివాస్, సుధీర్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్లినట్లు రాజేందర్ భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
చంద్రబోస్ సోదరుడు రాజేందర్, ఆయన భార్య వసంత హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేట డాలర్ డ్రీమ్స్లో నివాసం ఉంటున్నారు. రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గత నెల 18వ తేదీన బెంగళూరు వెళుతున్నట్లు భార్యకు సమాచారం ఇచ్చి వెళ్లారు. ఇక తాజాగా మీడియాతో చంద్రబోస్ మరో సోదరుడు మాట్లాడుతూ.. బెంగళూరు వెళుతున్నాడని చెప్పిన రాజేందర్ భూమికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి మదనపల్లికి వెళ్లారని వెల్లడించారు. ఈ నెల మూడో తేదీన ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు తమ కుటుంబానికి సమాచారం వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబోస్ సోదరుడు చెప్పుకొచ్చారు.