Reading Time: < 1 minute
Ms Dhoni Out Of Ipl 2026 Calf Injury Retirement Rumors Csk Fans Heartbreak

MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని ఈ సీజన్ (IPL 2026) మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పిక్క గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని, తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న కీలక పోరుకు కూడా అందుబాటులో లేకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మ్యాచ్‌ల వరకు ధోని మైదానానికి రాకపోయినా జట్టుతో పాటే ఉన్నాడు. అయితే ఢిల్లీతో మ్యాచ్ కోసం సీఎస్కే జట్టు ఢిల్లీకి పయనమవగా, ధోని వారితో కలిసి వెళ్లలేదని సమాచారం. ఈ విషయాన్ని సీఎస్కే బౌలింగ్ సలహాదారు ఎరిక్ సిమన్స్ స్వయంగా ధృవీకరించారు. “ధోని ప్రస్తుతం మాతో లేడు. ఆయన ఇంకా గాయం నుంచి కోలుకుంటున్నారు” అని సిమన్స్ పేర్కొన్నారు.

ముగిసిన శకం?
జట్టుతో పాటు ధోని ప్రయాణించకపోవడంతో ఆయన ఈ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 44 ఏళ్ల వయసులో గాయం తిరగబెట్టడం, మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో ఇదే ఆయనకు చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మైదానంలోకి దిగకుండానే ధోని రిటైర్మెంట్ ప్రకటించవచ్చని వస్తున్న ఊహాగానాలు సీఎస్కే అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో ధోని సేవలు అందుబాటులో లేకపోవడం చెన్నై జట్టు ప్రదర్శనపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 04 మ్యాచ్‌లు గెలిచి, 05 మ్యాచ్‌లు ఓడిపోయింది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌లు అత్యంత కీలకం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధోని గైర్హాజరు జట్టుకు పెద్ద లోటుగా మారింది. మరి ధోనీ ఈ సీజన్ చివరలోనైనా మైదానంలో కనిపిస్తాడా లేక ఇలాగే వీడ్కోలు పలుకుతాడా అనేది వేచి చూడాలి.