Reading Time: < 1 minute
South Coast Railway Zone Announced With Visakhapatnam Hq From June 1 2026

South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి తర్వాత విడుదల చేసిన గెజిట్ ద్వారా South Coast Railway Zone ఏర్పాటు అధికారికంగా ప్రకటించింది. రైల్వే చట్టం ప్రకారం ఈ కొత్త జోన్ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ జోన్‌కు ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. ఈ కొత్త రైల్వే జోన్‌ను ఇప్పటికే ఉన్న East Coast Railway మరియు South Central Railway జోన్ల నుంచి విభజించి ఏర్పాటు చేస్తున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. అలాగే ప్రస్తుత వాల్టేర్ డివిజన్‌ను విభజించి, విశాఖపట్నం డివిజన్‌గా మార్చే ప్రక్రియను కూడా ప్రారంభించారు.

వాల్టేర్ డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించడం ఈ నిర్ణయంలో ముఖ్యాంశం. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్త రాయగడ డివిజన్‌గా ఏర్పాటు చేస్తుండగా, మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖ డివిజన్‌గా మార్చనున్నారు. ఈ మార్పులు కూడా జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్యల వల్ల రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి, ప్రాంతాల వారీగా పర్యవేక్షణ మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాయగడలో ఏర్పాటు చేసే కొత్త డివిజన్‌లో కోరాపుట్–సింగపూర్ రోడ్, కొత్తవలస–కిరండూల్, కునేరు–థెరువలి, గుణుపూర్–పర్లకిమిడి వంటి మార్గాలు చేరనున్నాయి. ఈ డివిజన్ మొత్తం 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా పలాసా–ఇచ్ఛాపురం మార్గాన్ని ఖుర్దా రోడ్ డివిజన్ నుంచి విశాఖ డివిజన్‌కు బదిలీ చేశారు.

ఇక, ఆపరేషనల్ అవసరాల దృష్ట్యా గుంటకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య కూడా మార్పులు చేపట్టారు. రాయచూర్–వాడి, విష్ణుపురం–పగిడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ అయ్యాయి. కొండపల్లి–మోతుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్‌లో చేర్చారు. కొత్త సరిహద్దులను కూడా స్పష్టంగా నిర్ణయించారు. మొత్తంగా ఈ మార్పులతో రైల్వే మార్గాల నిర్వహణ సులభతరం అవుతుందని, సేవల సమన్వయం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి మరింత వేగం వస్తుందని ఆశిస్తున్నారు.