Reading Time: < 1 minute
Maulana Salman Azhar Jaish Commander Killed Pakistan Suspicious Accident

Maulana Salman Azhar: పాకిస్థాన్ కేంద్రంగా భారత్‌పై కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ మౌలానా సల్మాన్ అజార్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దుల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ అగ్రశ్రేణి కమాండర్లలో ఒకడైన మౌలానా సల్మాన్ అజార్, బహవల్పూర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

బహవల్పూర్‌లో అంత్యక్రియలు
తాజా నివేదికల ప్రకారం.. సల్మాన్ అజార్ అంత్యక్రియలు ఈరోజు (ఏప్రిల్ 29, 2026) సాయంత్రం 4 గంటలకు పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న మర్కజ్ సుభానల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది జైష్ సానుభూతిపరులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదమా లేక ఎవరైనా పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా గతేడాది జూన్ మాసంలో కూడా జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన మరో కీలక వ్యూహకర్త మౌలానా అబ్దుల్ అజీజ్ ఈజర్ (అసర్) కూడా ఇటువంటి అనుమానాస్పద పరిస్థితుల్లోనే మరణించాడు. అజీజ్ ఈజర్ 2025 జూన్ 2న మరణించాడు. ఆయనది అధికారికంగా గుండెపోటు అని చెబుతున్నప్పటికీ, అతని మరణం వెనుక మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.

2016లో జరిగిన నాగోటా ఉగ్రదాడితో సహా భారత్‌లో జరిగిన అనేక విధ్వంసకర దాడుల వెనుక ఈజర్ హస్తం ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో భారత్‌కు వ్యతిరేకంగా విషపూరిత ప్రసంగాలు చేయడంలో ఇతను సిద్ధహస్తుడు. పాకిస్థాన్ ఆశ్రయంలో ఉంటూ భారత్‌పై దాడులకు తెగబడే ఉగ్రవాద నేతలు వరుసగా మరణిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది అబ్దుల్ అజీజ్, ఇప్పుడు సల్మాన్ అజార్ మరణించడంతో జైష్-ఎ-మొహమ్మద్ అగ్రనాయకత్వంలో కలవరం మొదలైంది. గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో లేదా అనుమానాస్పద ప్రమాదాల్లో ఉగ్రవాదులు హతమవుతుండటంతో పాకిస్థాన్ గడ్డపై వారికి రక్షణ కరువైందనే చర్చ నడుస్తోంది.