Reading Time: < 1 minute
పగతో రగిలిన ప్రతీకారం.. నిండు ప్రాణాలను బలి తీసుకున్న ‘అహం’.. ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం!

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బాకీ పడ్డ కేవలం రూ. 24,000 కోసం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్కర్ కి మిల్క్ ప్రాంతంలో సోమవారం (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన రాజా, ఫరా దంపతుల హత్య ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఈ దారుణానికి మూల కారణం ఒక చిన్న భూమి లావాదేవీ. నిందితుడు ఫహీం, మృతుడు రాజాకు కొంత భూమిని విక్రయించాడు. దానికి సంబంధించి రాజా ఇంకా రూ. 24,000 చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 19న ఈ విషయమై జరిగిన ఘర్షణలో రాజా, ఫహీం తలపై ఇటుకతో కొట్టాడు. గాయపడిన ఫహీం దీనిని తన పరువుకు సంబంధించిన విషయంగా భావించి, ఆసుపత్రి బెడ్‌పై నుంచే తన కుమారుడు ఫర్జాంద్‌ను ప్రతీకారం తీర్చుకోమని రెచ్చగొట్టాడు.

దంపతుల హత్య జరిగిన తీరు సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ముగ్గురు చిన్న పిల్లలు చూస్తుండగానే, ఆ చిన్న గదిలో దంపతులను అత్యంత కిరాతకంగా చంపడం నిందితుల వికృత చేష్టకు పరాకాష్ట. రాజా మృతదేహానికి వచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. రాజా శరీరంపై ఏకంగా 40 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాడి ఎంత తీవ్రంగా ఉందంటే, మెడ నరాలు తెగిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, కాలేయంలోకి కత్తి గాయాలయ్యాయి. తప్పించుకోవడానికి రాజా చేసిన ప్రయత్నానికి సాక్ష్యంగా చేతులపై 16 గాయాలు ఉన్నాయి. భార్య ఫరా మెడపై బలంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆ ప్రాంతమంతటా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫహీంను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో నిందితుడు అనాస్ మంగళవారం రాత్రి జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో పట్టుబడ్డాడు. అగ్వాన్‌పూర్ వద్ద జరిగిన కాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ తగిలింది. పరారీలో ఉన్న మరో నిందితుడు ఆరిఫ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చిన్న వివాదం, అహంకారం చివరికి ముగ్గురు పిల్లలను అనాథలను చేశాయి. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా, ఆ పసి హృదయాలకు జరిగిన గాయం ఎప్పటికీ మానిపోనిది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..