Reading Time: < 1 minute
Veteran Actor Director Tripuraneni Chitti Babu Passed Away Hyderabad

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు (71) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైటెక్ సిటీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.

Also Read : JD Chakravarthy: అందుకే హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి రానివ్వరు..

లెజెండరీ రచయిత త్రిపురనేని మహారథి (అల్లూరి సీతారామరాజు, సింహాసనం ఫేమ్) కుమారుడైన చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. 1955లో కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన, చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పలాచార్య, ఆత్రేయ వంటి గొప్ప రచయితల వద్ద శిష్యరికం చేసి సినిమా రంగంపై పట్టు సాధించారు. మోహన్ బాబు ప్రోత్సాహంతో ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్న ఆయన, సుమారు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా సౌందర్య ప్రస్థానంలో చిట్టిబాబు పాత్ర మరువలేనిది. కృష్ణ, భానుచందర్ ప్రధాన పాత్రల్లో ఆయన నిర్మించిన చిత్రంలో సౌందర్యను సెకండ్ హీరోయిన్ గా తీసుకుని వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. నటుడిగా కూడా ఆయన తన ముద్ర వేశారు. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రాఖీ’ సినిమాలో ఆయన పోషించిన నెగిటివ్ రోల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సుమారు 30 సినిమాల్లో నటించి, 50 చిత్రాలకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు.