
Nadendla Bhaskara Rao Passes Away: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. బుధవారం (ఏప్రిల్ 22, 2026) ఉదయం పరమపదించారు. వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా, ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని స్వగృహంలో ఉంచనున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నాదెండ్ల భాస్కర రావు కుటుంబీకులు తెలిపారు. ఆయన ఆకాంక్ష మేరకు గురువారం (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
నాదెండ్ల భాస్కరరావు జూన్ 23, 1935న గుంటూరు జిల్లాలో జన్మించారు. వృత్తిరీత్యా లాయర్. కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భాస్కరరావు 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు సమయంలో టీడీపీలో చేరారు. 1983లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా.. ఎన్టీఆర్ కేబినెట్లోనాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సమయంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు నెలపాటూ సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నాదెండ్ల భాస్కరావు సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం మరోసారి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.. 1994 ఎన్నికల్లో ఓడిపోయారు. 1998లో ఆయన ఖమ్మం ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.