Reading Time: < 1 minute
తీవ్రంగా గాయపడ్డ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..  అపోలో ఆసుపత్రికి తరలింపు..!

సంగారెడ్డి జల్లా పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ప్రమాదానికి గురైన వార్త నియోజకవర్గ ప్రజలను, ఆయన అనుచరులను ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న సొంత కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. బాత్‌రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కాలు జారి కింద పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అనూహ్య ప్రమాదంలో ఆయన వెన్నుముక భాగంలో తీవ్రమైన గాయమైంది.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. వెన్నుముకకు గాయం కావడంతో వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, మహిపాల్ రెడ్డి ప్రమాద వార్త తెలియగానే పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని, ఆందోళన పడాల్సిన పనిలేదని ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం. కాగా, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..