
ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఉపయోగిస్తున్న వాట్సాప్ త్వరలో కొత్త మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘వాట్సాప్ ప్లస్’ అనే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్పై కంపెనీ పని చేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్లస్, స్నాప్చాట్ ప్లస్ వంటి సేవలకు సమానంగా ఉండే అవకాశముంది. ఈ కొత్త ప్లాన్ ముఖ్యంగా యాప్ను తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవాలనుకునే సాధారణ వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాట్సాప్లో వ్యాపార అవసరాల కోసం కొన్ని చెల్లింపు ఫీచర్లు ఉన్నప్పటికీ, ఈ వాట్సాప్ ప్లస్ పూర్తిగా వ్యక్తిగత వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టనుంది.
ముఖ్యంగా యాప్ రూపాన్ని మార్చుకునే అవకాశం ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వినియోగదారులు కస్టమ్ యాప్ ఐకాన్లు, ప్రత్యేక చాట్ థీమ్లు, వ్యక్తిగతీకరించిన రింగ్టోన్లు, నోటిఫికేషన్ సౌండ్లు వంటి ఫీచర్లను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా చాట్ జాబితాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే విధానాలు కూడా అందుబాటులోకి రావచ్చు. ఈ ప్రీమియం ప్లాన్లో అత్యంత గమనించదగ్గ ఫీచర్గా చాట్ పిన్ పరిమితి పెంపు నిలుస్తోంది. ప్రస్తుతం ఉచిత వినియోగదారులు కేవలం మూడు చాట్లను మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వాట్సాప్ ప్లస్ ద్వారా ఈ సంఖ్య 20 వరకు పెరగవచ్చని సమాచారం. దీంతో వ్యక్తిగత, కుటుంబ, కార్యాలయ చాట్లను సులభంగా వేరు చేసి నిర్వహించుకోవడం సులభమవుతుంది.
టెస్టింగ్ దశలో కొంతమందికి ఉచిత ట్రయల్ కూడా ఇవ్వవచ్చని సమాచారం. అయితే ఈ ప్లాన్ ప్రకటనలను తొలగించదని స్పష్టం అవుతోంది, అంటే వినియోగదారులు ప్రధానంగా వ్యక్తిగతీకరణ కోసం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమిత సంఖ్యలో వినియోగదారులతో పరీక్షించబడుతోంది. భవిష్యత్తులో ఇది విజయవంతమైతే, మెటాకు కొత్త ఆదాయ మార్గంగా మారే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా ఇది అందుబాటులోకి వస్తే, ఎక్కువగా వాట్సాప్ను ఉపయోగించే వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి