Reading Time: < 1 minute
China India Relations Wang Yi Partnership Global South

China: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ చైనా, భారత స్నేహాన్ని కోరుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్, చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూసుకోవాలని అన్నారు. చైనా, భారత్‌లు రెండు ‘‘గ్లోబల్ సౌత్’’లో భాగమని, లోతైన సాంస్కృతిక సంబంధాలు, విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజింగ్‌లో జరిగిన 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ సెషన్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

చైనా, భారత్ మధ్య పరస్పర విశ్వాసం, సహకారం భాగస్వామ్య అభివృద్ధికి అత్యంత సానుకూలంగా ఉన్నాయని, అయిత విభజన, ఘర్షణ ఆసియా ఆసియా పునరుజ్జీవనానికి విరుద్ధం అని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పారు. దీంతో రెండు దేశాల మధ్య సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.

Read Also:Nishant Kumar: జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ తనయుడు..

గత ఏడాది ఆగస్టులో టియాంజిన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశమయ్యారని వాంగ్ యి గుర్తు చేసుకున్నారు. కజాన్ తర్వాత జరిగిన ఈ సమావేశం భారత్-చైనా సంబంధాలను మరింత బలోపేతం చేసిందని, రెండు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం క్షేత్రస్థాయిలో అమలు చేయబడుతోందని, వాణిజ్యం గరిష్ట స్థాయికి చేరుకుందని అన్నారు.

బ్రిక్స్ వేదికలో భారత్, చైనాలు కలిసి పనిచేయాలని వాంగ్ యీ చెప్పారు. ఈ ఏడాది బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. వచ్చే ఏడాది చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, కొన్ని ఏళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ ఆంక్షలు కూడా చైనాలో ఆందోళన పెంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ యుద్ధం కూడా చైనా ఎకానమీని ప్రభావితం చేస్తుంది. దీంతో భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనా ఆరాట పడుతోంది.