Reading Time: < 1 minute

న్యూఢిల్లీ/పాట్నా: ఈనెల16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు బిజెపి తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను మంగళవారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పోటీ చేయనున్నారు. అదే రాష్ట్రం నుంచి శివేష్ కుమార్, -అస్సాం నుంచి తారేష్ గోవాలా, జోగెన్ మోహన్, -ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీవర్మ, -హర్యానా నుంచి సంజయ్ భాటియా, -ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్‌మోహన్ సామల్, సుజీత్ కుమార్, త్వరలో ఎన్నికలు జరగనున్న -పశ్చిమబెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను అభ్యర్థులుగా ప్రకటించారు. సంజయ్ భాటియా 2019 నుంచి 2024 వరకూ కర్నాల్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాల్ నుంచి రికార్డు స్థాయిలో 6,56,142 ఓట్ల అధిక్యంతో గెలిచారు. జోగెన్ మోహన్ ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో రవాణా సహా పలు శాఖలు నిర్వహిస్తున్నారు. తారేష్ గోవాలా అసోంలోని దిబ్రూగఢ్ జిల్లా దులియాజన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. శివేష్ కుమార్ ఇంతకుముందు బీహార్‌లోని అజియోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. రాహుల్ సిన్హా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం మాజీ అధ్యక్షుడుగా ఉన్నారు.

లక్ష్మీ వర్మ ఛత్తీస్‌గఢ్ బీజేపీలో సీనియర్ మహిళా నేతగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. సుజీత్ కుమార్ గతంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) సభ్యుడిగా ఉండేవారు. అయితే 2024లో ఆ పార్టీకి, రాజ్యసభ సీటుకు ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో అదే స్థానానికి ఆయన పోటీ చేసి తిరిగి ఎన్నికకావడం విశేషం.