Reading Time: < 1 minute
Godavari Floods Mulugu Jurala Project Gates Open

Telangana Rains: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి నది ప్రమాద హెచ్చరికలను మోగిస్తుండగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటి మట్టం 19.36 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో కేంద్ర జల సంఘం అధికారులు డేంజర్ లెవెల్ హెచ్చరికను జారీ చేశారు. నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ తక్షణమే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

ఎడతెరిపి లేని వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద పోటుతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఏజెన్సీలోని అనేక అటవీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంకటాపురం మండలంలో పెంకవాగు, జిన్నుల వాగులు ఉగ్రరూపం దాల్చడంతో తిప్పాపురం, పెంకవాగు, కొత్త గుంపు, సీతారాంపురం, ముత్తారం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే కుక్కతోగు, బోధపురం వాగులు పొంగి వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు వాజేడు మండలంలో కొంగల వాగు, బహుద జలపాతం వాగు ప్రవాహం తీవ్రమవ్వడంతో నేషనల్ హైవే 163 పైకి వరద నీరు చేరి సుమారు 25 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు 24 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,36,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 1,33,000 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో ద్వారా కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా, ప్రస్తుతం 1041.962 అడుగులకు చేరుకుంది. మొత్తం 9.657 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 8.164 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుండటంతో పాటు వివిధ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు.