
Rega Kantha Rao: తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసి, కేసును క్వాష్ చేయాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. యూట్యూబ్ ఛానెల్ నిర్మాణం పేరుతో ఫ్లాట్కు పిలిపించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించారంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 26న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రేగా కాంతారావుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను సవాలు చేస్తూ, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. హైకోర్టు ఈ రోజు చేపట్టే విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
అసలు విషయం ఏంటి?
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావుపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించి, మోసం చేశారంటూ ఓ యువతి నాంపల్లిలోని గౌరవ XIV అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. ఆమె నగరంలో ఓ పీజీలో నివసిస్తూ మీడియా రంగంలో పనిచేస్తోంది. 2022లో ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతా రావుతో పరిచయం ఏర్పడింది. కొత్త యూట్యూబ్ ఛానల్ నిర్మాణం పేరుతో మొదలైన ఈ పరిచయం, పెళ్లి చేసుకుంటాననే హామీతో క్లోజ్ రిలేషన్షిప్గా మారింది. అమీర్పేటలోని ఓ ఫ్లాట్లో కొన్నాళ్లు సహజీవనం చేసినట్లు, ఈ క్రమంలో తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
అంతేకాకుండా, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పేరుతో తన వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుని, ఆ తర్వాత నుంచి ముఖం చాటేశారని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఈ విషయంపై ఒత్తిడి తేగా, ఆయన అనుచరుల ద్వారా కొన్ని విడతలుగా రూ.8.5 లక్షలు బదిలీ చేసినప్పటికీ, తన సమస్య కేవలం డబ్బుకు సంబంధించింది కాదని.. నాలుగేళ్ల పాటు పెళ్లి పేరుతో మోసం చేసి శారీరకంగా దోపిడీ చేయడమేనని స్పష్టం చేసింది. గతంలో షీ టీమ్స్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా, రేగా కాంతా రావు తనపై ఎదురు ఆరోపణలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకూ, తన కుటుంబానికి ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. 2026 జూలై 26న అందిన ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 69, 351(2) కింద ఎఫ్ఐఆర్ (FIR 589/2026) నమోదు చేసి, కేసు విచారణను ఎస్ఐపీ నరసింగరావుకు అప్పగించారు. కాగా, ఈ ఆరోపణల నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.