
లైంగిక వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే జైలుపాలు అయ్యాడు. అయితే ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన అంశాలు వెల్లడైనట్లు సమాచారం. నిందితుడి వ్యక్తిగత ప్రవర్తన, బాధితురాలితో పరిచయం ఏర్పడిన విధానం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పోలీసులు తమ నివేదికలో ప్రస్తావించారు.
పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం, ఉదయ్ కృష్ణారెడ్డి గతంలోనే ఇద్దరు యువతులకు వివాహ ప్రతిపాదన చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వారిలో ఒకరు అతడి ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. అనంతరం బాధితురాలితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా సాన్నిహిత్యంగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. ఉదయ్ నేపథ్యం, అతడి వ్యక్తిగత పరిస్థితుల గురించి తెలుసుకున్న బాధితురాలు సానుభూతితో వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితురాలు కూడా సివిల్ సర్వీసెస్కు ఎంపికై ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో, ఐఏఎస్కు సిద్ధమవుతున్న విషయాన్ని అతడితో పంచుకున్నట్లు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్గా ఎంపికైన తర్వాత సోషల్ మీడియాలో అతడి విజయ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో బాధితురాలు అతడిని సంప్రదించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే కొంతకాలం తర్వాత ఉదయ్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. అతడి వ్యవహారశైలితో విసిగిపోయిన బాధితురాలు దూరంగా ఉండేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వివాదాలు పెరిగాయి. బాధితురాలి వ్యక్తిగత వీడియోలు ఆమె అనుమతి లేకుండా భర్తకు చేరవేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై ప్రశ్నించిన సమయంలో బాధితురాలిపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు, అశోక్నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి తాత్కాలిక నివాసంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇంట్లో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపినట్లు తెలుస్తోంది. వాటిలోని డేటా, ఇతర వివరాల ఆధారంగా దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.
అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న ‘అభ్యాస ఐఏఎస్ అకాడమీ’కు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అతడి సివిల్స్ విజయ ప్రయాణం ఆధారంగా సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు, సంబంధాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలికి ముందు ఉదయ్ ప్రతిపాదన చేసినట్లు చెబుతున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఆధారాల పరిశీలన, సంబంధిత వ్యక్తుల విచారణ ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..