Reading Time: < 1 minute
Telangana Ration Card Ekyc Deadline Extended August 31

Telangana Civil Supplies: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ తీపి కబురు అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ముమ్మరంగా సాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ-కేవైసీ (e-KYC) నవీకరణ పూర్తికాకపోతే నిత్యావసర సరకులు నిలిచిపోతాయనే ఆందోళనలో ఉన్న కార్డుదారులకు ఊరటనిస్తూ, e-KYC పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు.

దీంతో పాటు వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు, ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు లబ్ధిదారులు ప్రతినెలా రేషన్ షాపుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే వెసులుబాటు కల్పించారు. ఇంకా e-KYC పూర్తి చేయని లబ్ధిదారులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణాలను సంప్రదించి, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడంతో పాటు నిర్ణీత తేదీల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని తప్పకుండా తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.