Reading Time: 3 minutes
Jana Nayakudu: దళపతి విజయ్ సినిమాకు మరో షాక్! ‘జన నాయకుడు’ నిర్మాతలకు ఓటీటీ సంస్థ హెచ్చరిక

జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా లేవు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ సమస్య ల కారణంగా ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పటికీ ఈ మూవీ నిర్మాతలు కోర్టు చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో జన నాయగన్ సినిమా విడుదలయితే చాలు అనే స్థితిలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో చిత్ర బృందం ఆందోళనలు మరింత పెరిగాయి. ‘జన నాయగన్’ దళపతి విజయ్ కెరీర్‌లో చివరి సినిమా. దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమిత కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రారంభించి ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు విజయ్.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘జన నాయగన్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.120 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సినిమా అసలు విడుదల తేదీ జనవరి 9. దీని ప్రకారం, అమెజాన్ OTT విడుదల తేదీని నిర్ణయించింది. అయితే, ఈ సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు. దీని కారణంగా, OTT కంపెనీ నుంచి నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతుందని సమాచారం. ఒప్పంద నిబంధనల ఉల్లంఘన కింద నిర్మాతల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడమా?, లేదా అగ్రిమెంట్ మొత్తాన్ని తగ్గించుకోవడమా ?అన్న ప్లాన్ లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ ఉన్నట్లు సమాచారం.

జన నాయగన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేయకపోవడంపై ఆ బృందం కోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఆ బృందం ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీలు త్వరలో ఖరారుకానున్నాయి. దీంతో ఈ చిత్రం విడుదలకు మరిన్ని ఆటంకాలు ఎదురవుతాయి. దీంతో నిర్మాతలను మరింత ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.