
BJP-GenZ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలు విద్యార్థి రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ABVP నాలుగు కేంద్ర పోస్టుల్లో మూడు గెలుచుకుంది. అధ్యక్షుడిగా యశ్ దబాస్, కార్యదర్శిగా రియా ఛవ్డీ, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI నాలుగు కేంద్ర పోస్టుల్లో ఒక్కదాన్నీ దక్కించుకోలేకపోయింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ఉద్యమం, రాహుల్ గాంధీ విద్యార్థి అవుట్ రీచ్ కార్యక్రమాల తర్వాత ఈ ఫలితాలు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
జెన్-జీ ఉద్యమం, ‘ఛాత్రోంకీ గూంజ్’..
2026లో దేశవ్యాప్తంగా విద్యార్థి సమస్యలు రాజకీయ చర్చలో కీలకంగా మారాయి. NEET పేపర్ లీక్ వ్యవహారంపై మొదలైన యువత ఉద్యమంలో ‘కాక్రొచ్ జన్తా పార్టీ’ (CJP)కి మైలేజ్ తీసుకువచ్చింది. ఆ ఉద్యమాల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, పరీక్షా వ్యవస్థలో సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విద్యార్థుల సమస్యలపై ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేపర్ లీకులు, పరీక్షల సమస్యలు, అధిక విద్యా ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. జూన్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం కోటా, ప్రయాగ్రాజ్, డెహ్రాడూన్ సహా పలు ప్రాంతాల్లో కొనసాగింది. సెప్టెంబర్ 19న ఇండోర్లోనూ కార్యక్రమం నిర్వహించారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, ముఖ్యంగా యువత బీజేపీకి దూరం అవుతున్నారనే న్యారెటివ్ దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. తాము చేసిన ఉద్యమానికి ప్రధాని దిగొచ్చారని సీజేపీ తెగ ప్రచారం చేసుకుంది. నీట్ ఉద్యమం ఊపులో సీజేపీ రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ‘‘స్కూల్ ఠీక్ కరో’’ కార్యక్రమాన్ని చేపట్టింది. బీజేపీ పని అయిపోయింది, యువత దూరం అవుతున్నారనే తరుణంలో ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో విజయం మొత్తం రాజకీయ ఆటను మార్చేశాయని చెప్పొచ్చు.
ఢిల్లీ, పంజాబ్ వర్సిటీల్లో ABVP విజయం..
ఈ నేపథ్యంలోని DUSU ఎన్నికల్లో ABVP మూడు కేంద్ర పోస్టులు గెలుచుకోవడం రాజకీయంగా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా అధ్యక్ష పదవిలో ABVP అభ్యర్థి యశ్ దబాస్.. NSUI అభ్యర్థి విజయ్ శంకర్ మీనాపై 2,053 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే వైస్ ప్రెసిడెంట్ పదవిలో స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ 30,615 ఓట్లతో గెలిచారు. దీనికి ముందు ఆగస్టులో జరిగిన పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ABVP–SOI మద్దతు ఉన్న అన్కిత్ బిధాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. AAP విద్యార్థి విభాగం రెండో స్థానంలో, NSUI మూడో స్థానంలో నిలికాయి.
జెన్-జీ బీజేపీ వైపేనా..
బీజేపీ మద్దతు కలిగిన విద్యార్థి సంఘం గెలవడంతో ఆ పార్టీ సంతోషం వ్యక్తం చేస్తోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు వంటి వారు ఏబీవీపీ గెలుపుపై స్పందించారు. విద్యార్థి లోకం తమ వైపే ఉన్నారని చెప్పారు. ఢిల్లీ మాత్రమే కాదు, దీనికి ముందు పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా ఏబీవీపీ విజయం సాధించింది. ఈ రెండు గెలుపులతో బీజేపీ ఇప్పుడు తన న్యారెటివ్ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. కాక్రోచ్ ఉద్యమం తర్వాత, బీజేపీ పనైపోయింది, జెన్-జీ, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ తాజా ఎన్నికలు ఇప్పుడు ఈ కథనాన్ని పూర్తిగా మార్చేశాయి. సరిగ్గా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ యూనివర్సిటీ ఎన్నికలు జరిగడం, అందులో ఏబీవీపీ విజయం సాధించడం బీజేపీకి ప్లస్గా మారింది. ఇప్పుడు, జెన్-జీ యువత తమ వైపు ఉన్నారని కాషాయ పార్టీ ప్రచారంలోకి వెళ్లే ఛాన్స్ లభించింది. ఎక్కడైతే జెన్-జీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందో, ఇప్పుడు అక్కడే ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటినట్లు అయింది.
యూపీ, పంజాబ్ ఎన్నికల ముందు బీజేపీలో జోష్..
దేశ రాజకీయాలను మార్చే ఎన్నికలుగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో అధికారం సాధించిన వారే 2029లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. బీజేపీ మూడోసారి గెలవాలని చూస్తోంది. మరోవైపు, బీజేపీని అడ్డుకోవాలని సమాజ్వాదీ-కాంగ్రెస్ కూటమి భావిస్తోంది. ఇలాంటి సమయంలో విద్యార్థి ఎన్నికల్లో ఏబీవీపీ విజయాలు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్లు యువత దూరమయ్యారనే ప్రచారాన్ని, బీజేపీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. యువతను ఆకర్షించడానికి మరింత జోరుగా ప్రచారం నిర్వహించే అవకాశ ఏర్పడింది. ఇదే సమయంలో ప్రతిపక్షాలను డిఫెన్స్ పడేసేలా ఈ విద్యార్థి విజయాలను ఉపయోగించుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది.