Reading Time: < 1 minute
DUSU ఎన్నికల్లో సత్తా చాటిన ఏబీవీపీ.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ట్వీట్..

2026 సంవత్సరానికి గాను ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఏబీవీపీకి చెందిన యశ్ దబాస్ అధ్యక్షుడిగా, స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ ఉపాధ్యక్షుడిగా, ఏబీవీపీకి చెందిన రియా ఛావడి కార్యదర్శిగా, లక్ష్య రాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకున్నారు. మొత్తం నాలుగు ప్రధాన పోస్టులకు జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధాన విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ, వామపక్ష సంఘాలు హోరాహోరీగా తలపడ్డాయి. కాగా.. ఈ ఎన్నికల్లో మూడు స్థానాలను ఏబీవీపీ తన ఖాతాలో వేసుకుని ఘన విజయాన్ని నమోదు చేసుకుని.. ప్రాబల్యాన్ని చాటుకుంది. కాగా.. మూడు స్థానాలను ఏబీవీపీ కైవసం చేసుకోవడం పట్ల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందనలు తెలిపారు. ABVP విద్యార్థుల సంక్షేమం, సేవ, దేశ నిర్మాణానికి కట్టుబడి ఉందని.. ఎల్లప్పుడూ ఇదే విధానాన్ని అవలంభిస్తుందని తెలిపారు.

‘‘DUSU Election 2026 లో అధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను కైవసం చేసుకున్నందుకు, ABVP, దాని అంకితభావం గల కార్యకర్తలకు అభినందనలు.. జాతీయ కేడర్ ఆధారిత సంస్థగా, ABVP నిరంతరం విద్యార్థుల సంక్షేమం, సేవ, దేశ నిర్మాణానికి కట్టుబడి ఉంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు అందించిన మద్దతే ఈ ఫలితం. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు విజయవంతమైన పదవీకాలం, విద్యార్థి సమాజానికి సేవ చేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తున్నాను’’.. అంటూ ప్రహ్లాద్ జోషి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు..