Reading Time: < 1 minute
Teacher Accused Of Getting Students To Give Head Massage At Kasturba School Probe Ordered

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. విద్యార్థినులతో తలకు కొబ్బరి నూనె రాయించుకుని మసాజ్ చేయించుకోవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు.

కస్తూరీబా గాంధీ పాఠశాలలో టీచర్ రూపా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇద్దరు విద్యార్థినులతో తన తలకు కొబ్బరి నూనె రాయించి మసాజ్ చేయించుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వ్యక్తులు రహస్యంగా ఫోటోలు తీశారు. అనంతరం ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో ఇలాంటి వ్యక్తిగత పనులు చేయించుకోవడం ఏమాత్రం సమంజసం కాదని, పాఠశాలల్లో పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని మండిపడ్డారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక సమాచారం సేకరించి విచారణకు ఆదేశించారు. వైరల్ అవుతున్న ఫోటోలతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి.. నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. విచారణ ఆధారంగా టీచర్ రూపాపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.