Reading Time: 2 minutes
Delhi Police Facial Recognition System Jantar Mantar Protests Security

CJP Protests: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఆందోళనల వేళ భద్రతా దళాలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించాయి. నిరసనల పేరుతో దాడులకు పాల్పడాలని చూస్తున్న ముఠాలకు చెక్ పెడుతూ ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) కెమెరాలను అమర్చింది. ఈ కెమెరాలతో ఢిల్లీ పోలీసులు బృందం వీడియోను క్యాప్చర్‌ చేసింది. ఇక్కడే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ నిరసనల్లో ఏకంగా 2,500 మందికి పైగా పాత నేరస్థులను ఢిల్లీ పోలీసులు పసిగట్టడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జంతర్ మంతర్ పరిసరాల్లోని ప్రధాన ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై-రిజల్యూషన్ కెమెరాలను నిఘా వర్గాలు ఏర్పాటు చేశాయి. ఇవి నేరుగా ఢిల్లీ పోలీస్ అధికారిక డేటాబేస్‌తో అనుసంధానమై పనిచేస్తున్నాయి. భారీగా తరలివచ్చిన జనసమూహాన్ని ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు చొరబడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా నిరోధించడమే ఈ భారీ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని పీటీఐ (PTI) వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ సాంకేతికత పనితీరు గురించి ఒక పోలీసు ఉన్నతాధికారి వివరిస్తూ.. ఈ వ్యవస్థ ఉద్దేశం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాధారణ విద్యార్థులను లేదా పౌరులను ఇబ్బంది పెట్టడం కాదని స్పష్టం చేశారు. కేవలం వేలాది మంది గుమిగూడిన చోట తమ నేర ప్రవృత్తిని ఉపయోగించి గందరగోళం సృష్టించాలని చూసే పాత నేరస్థులను ఏరివేసేందుకే దీనిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కెమెరాలు చాలా దూరంలో ఉన్న వ్యక్తుల ముఖాలను సైతం అత్యంత స్పష్టంగా క్యాప్చర్ చేయగలవు. అలా క్యాప్చర్ చేసిన చిత్రాలను క్షణాల వ్యవధిలోనే పోలీస్ రికార్డులతో సరిపోలుస్తాయి. పోలీసు డేటాబేస్‌లోని మోస్ట్ వాంటెడ్ నేరస్థులు, పరారీలో ఉన్న ముద్దాయిలు, హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్లు లేదా పోలీసు భాషలో బ్యాడ్ క్యారెక్టర్స్ (BCs) గా నమోదైన వ్యక్తి ఎవరైనా ఈ పరిసరాల్లో కనిపిస్తే, వెంటనే సంబంధిత పోలీస్ యూనిట్‌కు ఆటోమేటిక్‌గా అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. దీనివల్ల ఎలాంటి ఆలస్యం లేకుండా అధికారులు వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతోంది. జూలై 20 సంఘటనల అనంతరం జంతర్ మంతర్ ప్రాంతంలో పటిష్టం చేసిన సమగ్ర భద్రతా చర్యల్లో భాగంగానే ఈ డిజిటల్ నిఘా వ్యవస్థను రంగంలోకి దించారు. దీంతో ఏకంగా 2,500 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులను గుర్తించారు.