Reading Time: 2 minutes
Prabhas Srinu Praises Ss Rajamouli Humility And Simple Lifestyle

Prabhas Srinu : ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో స్థాయి పెరిగేకొద్దీ అహం, గర్వం కూడా పెరిగే అవకాశం ఉంటుందని, కానీ అలాంటి సమయంలో మనల్ని నేల మీద నిలబెట్టే వ్యక్తులు ఎంతో అవసరమని ఆయన అన్నారు. తనకు అలాంటి గొప్ప పాఠాలు నేర్పిన వ్యక్తి రాజమౌళేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒక నటుడిగా మంచి పేరు రావడం మొదలైతే మనలో తెలియకుండానే కొంత గర్వం వస్తుంది. ‘ఇప్పుడు నేను ఎదుగుతున్నా’ అనే భావనతో పాటు అహం కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలో, ఎంత సింపుల్‌గా జీవించాలో రాజమౌళి గారిని చూసి నేర్చుకున్నాను” అని చెప్పారు.

‘విక్రమార్కుడు’ సినిమా రోజుల నుంచే రాజమౌళితో తనకు సన్నిహిత పరిచయం ఉందని ఆయన తెలిపారు. షూటింగ్‌ల మధ్య విరామ సమయంలో కూడా రాజమౌళి చాలా సాధారణంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో ఆయన బైక్‌పై షూటింగ్‌కు వచ్చేవారు. బ్రేక్ టైమ్‌లో సెట్‌లోనే ఎక్కడైనా గడ్డి మీద పడుకుని విశ్రాంతి తీసుకునేవారు. ఎలాంటి స్టార్ హంగులు ఆయనలో కనిపించేవి కావు” అని అన్నారు. రాజమౌళి ఇంటి వాతావరణం కూడా ఎంతో సాధారణంగా ఉండేదని చెప్పారు. హీరోలు, టెక్నీషియన్లు, డ్రైవర్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే కుటుంబంలా కలిసి భోజనం చేసేవారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి కావని వివరించారు. అదే తనకు జీవితంలో గొప్ప పాఠంగా మారిందన్నారు. చిన్న విషయాలకే ఈగో పెంచుకోవడం సరైంది కాదని, ఏదైనా సమస్య ఎదురైతే ముందుగా కారణం తెలుసుకోవాలని రాజమౌళి జీవనశైలి ద్వారా నేర్చుకున్నానని ఆయన చెప్పారు. “మనకు ఒక విషయం నచ్చకపోతే వెంటనే స్పందించే బదులు, దాని వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. ఆ ఆలోచన నాకు రాజమౌళి గారిని చూసే వచ్చింది” అని పేర్కొన్నారు. ‘ఛత్రపతి’ సినిమా సమయంలో నుంచి రాజమౌళి ఇంటికి తరచూ వెళ్లేవాడినని, ఆయన పని చేసుకుంటుంటే తాము కింద కూర్చొని సరదాగా గడిపేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయనను దగ్గర నుంచి చూస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదని చెప్పారు. “రాజమౌళి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన మా అందరికీ గురువు. మా దృష్టిలో ఆయన దేవుడితో సమానం” అంటూ ప్రభాస్ శ్రీను తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.